Rathasapthami Arrangements in Tirumala Temple :కలియుగ ప్రత్యేక్షదైవం శ్రీవేంకటేశ్వరుని క్షేత్రం తిరుమల రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహనాలపై దర్శనం ఇవ్వనున్న సప్తగిరీశుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మలయప్ప స్వామి ఊరేగింపు కోసం తిరుమాఢ విధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
తిరుమలలో జరగనున్న రథసప్తమికి వచ్చే భక్తుల కోసం ఉద్యోగులు, సిబ్బంది, సమష్టిగా, ప్రణాళిక బద్ధంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు సూచించారు. రథసప్తమికి వచ్చే భక్తులకు అందించే సేవలపై తిరుమల ఆస్థాన మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉమ్మడి కార్యచరణతో పని చేయాలని సిబ్బందికి నిర్దేశించారు.
'ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం సూర్య జయంతి పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి సన్నిధిలో జరిగే రథసప్తమి వేడుకలను ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విశేషంగా 7 వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున సూర్యోదయం నుంచి జరిగే వాహన సేవలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.'-వేణుగోపాల దీక్షీతులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు