ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 4:40 PM IST

Updated : Jul 21, 2024, 7:06 PM IST

ETV Bharat / state

కొనసాగుతున్న వరద - వణికిపోతున్న గోదావరి పరివాహక ప్రాంతాలు - Rains Effect in Joint East Godavari

Rains Effect in East Godavari District: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో స్థానికులు పడవల్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

Rains_Effect_in_Joint_East_Godavari
Rains_Effect_in_Joint_East_Godavari (ETV Bharat)

Rains Effect in East Godavari District: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గినా వరద మాత్రం వీడటం లేదు. గోదావరి వరద ఉద్ధృతికి పరివాహక ప్రాంతాలు వణికిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఎర్రకాలువ ప్రవాహానికి సింగవరం, నందమూరు, తాళ్లపాలెంలో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

కొండ కాలువ ఉద్ధృతికి కొవ్వూరు, గోపాలపురంలో ఇళ్లలోకి వరద చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పడవల్లోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. వరి చేలు నీటమునిగి నాట్లు నీటిలో తుడిచిపెట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అలసత్వం వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో తమను కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కురిసిన వర్షాలకు పంట చేలు నీటమునిగాయి. కనుచూపుమేర పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల పరిధిలో లక్షల ఎకరాల్లో కౌలు రైతులు వరి సాగు చేస్తున్నారు. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదీపాయలకు పోటెత్తుతున్న వరద రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాలువ ఆధునికీకరణలో అధికారులు అలసత్వంగా వ్యవహరించడంతో వ్యర్థాలు పేరుకుపోయాయి. పూడిక తీయకపోవడంతో వర్షపునీరు పైకి ఎగదన్నుతోంది. నీరు బయటకు పోయే మార్గం లేక నాలుగు రోజులుగా వరినాట్లు నీటిలోనే నానుతున్నాయి. నాట్లు వేసిన చేలల్లో మునలు పైకి తేలుతుండటంతో రైతుల దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పంట చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయిని, నారు కుళ్లిపోతే నష్టపోతామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అల్లూరి జిల్లాలో వరద బీభత్సం- ప్రమాదకరంగా జలాశయాలు - RAIN EFFECT IN ALLURI DISTRICT

గోదావరి నదికి వరద పోటెచడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. బూరుగులంక, ఉడుముడి లంక, అరిగెలవారి పేట, జి.పెదపూడి లంక గ్రామాల ప్రజలు మరపడవలలో పి.గన్నవరం మండలం వైపు రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో వరద ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు.

భారీ వర్షాలు కారణంగా గోదావరి నదిలో కలుస్తున్న నీటిని తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు వదలడంతో గౌతమి వద్ద నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ధవలేశ్వరం బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడంతో యానాం వారధి వద్ద ఉదయం ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. ఆదివారం కావడంతో పర్యాటకులు యానాం వస్తున్నారు. పర్యాటక శాఖ ద్వారా నిర్వహించే బోట్ షికారులను వరద ప్రవాహం కారణంగా అధికారులు నిలిపివేశారు. మత్స్యకారులు తమ నావలు, వలలు, తాళ్లు కొట్టుకుపోకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద పరిస్థితిని యానాం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణం నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

కాల్వలను పట్టించుకోని గత ప్రభుత్వం- పంట నీట మునగడంతో అన్నదాతల ఆవేదన - Farmers Lost Crops

Last Updated : Jul 21, 2024, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details