Metpalli Railway Station Problems : జగిత్యాల జిల్లా మెట్పల్లి రైల్వే స్టేషన్ 2016 నవంబర్లో ప్రారంభమైంది. కరీంనగర్ నిజామాబాద్ మార్గంలో ఉన్న ఈ స్టేషన్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. రోజుకు ఒకసారి పుష్ఫుల్ రైలు మాత్రమే ఈ మార్గంలో నడుస్తుంది. రైలు కోసం ఎన్నో కలలు కన్న స్థానికులకు ఆశలు అడియాసలే అయ్యాయి. ఆ ఒక్క రైలు సేవలనైనా వినియోగించుకుందామంటే మెట్పల్లి రైల్వే స్టేషన్ దుర్భరంగా ఉంటుంది. స్టేషన్లోని కొన్ని కట్టడాలు శిథిలమైపోతున్నాయి.
రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం సమీపంలోనే కోట్లాది రూపాయలతో మూడేళ్ల క్రితం క్వార్టర్స్ నిర్మించారు. ఇవి వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. క్వార్టర్స్లోని విద్యుత్ పరికరాలు, వివిధ సామాగ్రిని దుండగులు దొంగిలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఆ రైల్వే స్టేషన్లో రోజూ టికెట్లు కొంటారు కానీ రైలెక్కరు- ఎందుకో తెలుసా?
కనీస తాగునీరు సదుపాయాలు లేక : రైల్వే స్టేషన్ మెట్పల్లి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు కోసం ఎదురు చూసే ప్రయాణికులకు దాహం వేస్తే తాగడానికి నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. వర్షకాలంలో రైల్వే స్టేషన్కి వెళ్లాలంటేనే ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. స్టేషన్ చుట్టూ వర్షపు నీరు చేరి నడవలేని పరిస్థితి ఏర్పడుతోంది.