Airport In prakasam District: రాష్ట్రంలో నూతనంగా ఐదు విమానాశ్రయాలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో ప్రకాశం జిల్లాకు ఒక విమానాశ్రయం మంజూరు కానుంది. దీనిపై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పూర్తి స్తాయిలో దృష్టిపెట్టారు. డొమెస్టిక్ టెర్మినల్గా చిన్న విమానాలు దిగేందుకు అనువుగా ఇక్కడ ఎయిర్పోర్టును నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో అడుగు ముందుకు పడుతుంది.
ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్టు:ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కేంద్ర పౌర విమానాయన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్రావు సైతం రాష్ట్రంలో ఐదు విమానాశ్రమాల ఏర్పాటుకు అంగీకరించారు. దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయం కల నెరవేరనుంది. ఈ ఎయిర్ పోర్టు జిల్లా కేంద్రం ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న కొప్పోలు, ఆలూరు, అల్లూరు తదితర ప్రాంతంలో ఉన్న స్థలంలో ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు.అయితే ఈ స్థలం ఎంతవరకు అనుకూలమో సాంకేతిక పరిశీలన చేసిన తరువాతే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఒంగోలు ఎయిర్పోర్టుకు అనుకూలం:వాణిజ్య పరంగా ప్రకాశం జిల్లాకు గుర్తింపు ఉంది. జిల్లాలో గ్రానైట్, పొగాకు వంటి అంతర్జాతీయ వ్యాపారాలు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి పొందేవారు సంఖ్య గణనీయంగా ఉంది. దగ్గర్లో రామయ్యపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుండటం, సముద్ర తీరం కూడా అతి సమీపంలో ఉండటం వంటి కారణాలు వల్ల ఒంగోలు అన్ని విధాలుగా అనుకూలమని ప్రజాప్రతినిధులు పట్టుమీద ఉన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎయిర్ పోర్టు ఇక్కడే ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలను కలిసి విన్నపాలు అందించారు.
కొత్త ప్రతిపాదనల్లో 600 ఎకరాలు: ఈ ప్రాంతంలో వాన్పిక్కు చెందిన భూములు వేలల్లో ఉన్నాయి. 2009-10 సంవత్సరంలో ఈ భూముల్లో 3,150 ఎకరాలు ఎయిర్పోర్టు కోసం కేటాయించారు. ప్రకాశం ఎయిర్పోర్టు ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో భూములను కేటాయించి సరిహద్దులు కూడా నిర్ణయించారు. 3వేల మీటర్ల మేర రన్వే నిర్మించే విధంగా అంత భూమిని కేటాయించారు. అయితే అప్పట్లో వాన్పిక్ పై భారీ స్థాయిలో వివాదాలు నెలకొనడంతో ఈ భూములు ఈడీ ఎటాచ్మెంట్లోకి వెళ్ళాయి. అయితే కొత్తప్రతిపాదన ప్రకారం సమారు 600 ఎకరాలుకు సరిపెట్టి చిన్న విమానాలు దిగే విధంగా ఎయిర్ పోర్ట్ను నిర్మించనున్నారు.
నేల పటుత్వంపై చర్చ:ప్రతిపాదిత ప్రాంతంలో మధ్య నుంచి నల్లవాగు, పోతురాజు కాలువలు ప్రవహిస్తాయి. అందువల్ల ఈ వాగులను ఒక పక్కన ఉండే విధంగా విమానాశ్రయం స్థలాన్ని కొంచెం మార్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలో కొండలు వంటివి లేకపోవడం కొంత సానుకూల అంశమే అయినప్పటికీ బాపట్ల జిల్లా సూర్యలంక ప్రాంతంలో ఆర్మీ ఫైరింగ్ జోన్గా ఉండటం వల్ల దీన్ని ఎలా అధిగమించాలనే దానిపై చర్చ సాగుతుంది. దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల విమానాలు ల్యాండింగ్కు ఇబ్బంది ఉండకపోవచ్చని జిల్లా అధికారులు ఎయిర్పోర్టు అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు నేల పటుత్వం పై సైతం చర్చ సాగుతుంది.