Guntur Missing Pet Dog Case :పెంపుడు జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చాలా మంది శునకాలను అమితంగా ఇష్టపడుతుంటారు. అలా ప్రేమగా చూసుకునే ఓ పెంపుడు కుక్క తప్పిపోవడంతో ఆ కుటుంబంసభ్యులు ఆందోళన చెందారు. గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో నివాసం ఉండే మోజెస్ అనే వ్యక్తి కుటుంబం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకాన్ని రెండేళ్లుగా పెంచుకుంటున్నారు. దానికి మ్యాక్స్ అని పేరు కూడా పెట్టుకున్నారు.
రెండు గంటల్లోనే ఫలించిన ఫలితం : ఈ నెల 10వ తేదీ నుంచి మ్యాక్స్ కనిపించలేదు. రెండు రోజుల పాటు దాని కోసం గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫలితం కనిపించకపోవడంతో స్థానిక కేబుల్ టీవీలో ప్రకటన ఇచ్చారు. నగరంలో ప్లెక్సీలు వేయించారు. అయినా శునకం జాడ దొరకలేదు. దీంతో వినూత్నంగా ఆలోచించి కరపత్రాలు ముద్రించారు. కుక్క ఫొటోతో పాటు ఎప్పుడు తప్పిపోయింది, దాని వయస్సు, ఆనవాళ్లు తదితర వివరాలన్నీ పాంప్లెట్లో పొందుపరిచారు. ఈ కరపత్రాలను అన్ని పత్రికల్లో ఉంచి ఇంటింటికి వెళ్లేలా చేశారు. కరపత్రంలో ఫోన్ నంబర్తో పాటు ఆచూకీ చెప్పిన వారికి పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఇలా కరపత్రాలు పంచిన రెండు గంటల్లోనే ఫలితం కనిపించింది.
స్వర్ణభారతినగర్కు చెందిన ఆటోడ్రైవర్ జయరాజ్ ఫోన్ చేసి మ్యాక్స్ తనవద్దే ఉందని యజమానికి చెప్పాడు. వారం రోజుల క్రితం వర్షం పడుతుండగా మ్యాక్స్ ఇంటి నుంచి వెళ్లిపోగా అదే రోజు లక్ష్మీపురంలో ఆటోడ్రైవర్కు కనిపించింది. వీధికుక్కలు ఆ శునకం వెంటపడటం చూసిన ఆటోడ్రైవర్ దాన్ని కాపాడి తన ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. వారం రోజులుగా దానికి కావాల్సిన ఆహారం అందించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు. కరపత్రం చూసిన వెంటనే యజమానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చానని ఆటోడ్రైవర్ తెలిపారు. పెంపుడు కుక్కను చూసిన తర్వాత యజమాని కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.