ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అల్లుకున్న ఆ స్నేహబంధం ఏమిటో! - చర్యలు తీసుకోవడంలో మౌనం ఎందుకో? - PERNI NANI PDS RICE CASE

పేర్నినాని గోదాములో మాయమైన బియ్యం కేసులో అధికారుల తీరుపై విమర్శలు - కేసు నమోదు చేసి నెల కావస్తున్నా నిందితులను పట్టుకోని పోలీసులు

Perni_Nani_PDS_Rice
PERNI NANI PDS RICE CASE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2024, 10:02 AM IST

PERNI NANI PDS RICE CASE: మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లో మాయమైన రేషన్ బియ్యం కేసులో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి నెలకావొస్తున్నా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు. రేషన్‌ బియ్యం మాయంలో పేర్నినాని కుటుంబం అడ్డంగా దొరికిపోయినా చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చేష్ఠలుడిగి చూస్తున్నారంటూ కూటమి పార్టీల శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

కేసు నమోదు చేసి 15 రోజులపైనే: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నంలోని ఇన్వెస్టర్‌ గోదాములో మాయమైన రేషన్‌ బియ్యం 7వేల 577 బస్తాలు. అధికారులు మొదట్లో 3వేల708 బస్తాలని చెప్పారు. తర్వాత 4వేల840 బస్తాలన్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి లెక్కల తర్వాత ఏకంగా 7వేల577 బస్తాలు మాయమైపోయాయని తేల్చారు. ఈ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టింది. తమ గోదాములో బియ్యం లెక్కలు తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబసభ్యులు గత నెల 26న లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం ఎన్నో గురువారానికి తేల్చారు.

బియ్యం మాయం ఘటనపై పోలీసుల తీరూ ఇంతే. కేసు నమోదు చేసి 15 రోజులపైనే అవుతోంది. ఇప్పటివరకు నిందితుల్ని అరెస్టు చేయలేకపోయారు. పైగా పారిపోయే అవకాశం ఇచ్చారు. ఇది చాలదా? ఘనత వహించిన అధికార యంత్రాంగం ఎంత చురుగ్గా పనిచేస్తుందో, ఎంత వేగంగా స్పందిస్తుందో చెప్పడానికి? నిజంగా వాళ్లే అనుకుంటే, లెక్కలు తేల్చడానికి, నిందితుల్ని అరెస్టు చేయడానికి ఇన్ని రోజులు అవసరమా? వీళ్లే కాదు గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన వైఎస్సార్సీపీ ముఖ్యనేత పేర్ని నాని కుటుంబ అక్రమాలు బయటపడినా మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు చూసి కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలే ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలో ఉంది మనమా? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయా? పేర్ని నాని అంటే ఇంకా భయమా? అనే ప్రశ్న వారిలో వ్యక్తమవుతోంది.

పిటిషన్‌ ఉపసంహరించుకున్న పేర్ని నాని, ఆయన కుమారుడు

ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ముఖ్యనేతలు: డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే రేషన్‌ బియ్యంపై రాజకీయం చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పైనా విరుచుకుపడుతున్నారు. రేషన్‌ బియ్యం మాయం ఘటనలో పేర్ని నాని కుటుంబం అడ్డంగా దొరికినా కూటమి ప్రభుత్వం, ముఖ్యనేతలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటమూ చర్చనీయాంశంగా మారింది.

గోదాములో బియ్యం మాయమైన విషయం తెలిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం ఉన్నతస్థాయి ఆదేశాల కోసం మొద్దు నిద్ర నటించింది. మార్గనిర్దేశం చేయాల్సిన జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర అచేతనంగా తయారయ్యారు. అటు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలూ రాలేదు. కూటమి పార్టీ, వైఎస్సార్సీపీ నేత మధ్య అల్లుకున్న స్నేహ, వ్యాపార సంబంధాలూ కేసులో సాగదీతకు మరో కారణం. వీటన్నిటి నేపథ్యంలోనే అధికారులు తీరిగ్గా వారం తర్వాత అంటే డిసెంబరు 4న గోదామును తనిఖీ చేసి నివేదిక ఇచ్చారు.

బ్లాక్​ లిస్టులోకి పేర్ని నాని గోడౌన్​! - రేషన్‌ బియ్యం మచిలీపట్నం తరలింపు

అరెస్టులో అలవిమాలిన జాప్యం ఎందుకు?: 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ లోగా కేసులో నిందితులైన మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన వారు పారిపోయారు. మాయమైన బియ్యానికి జరిమానాతో కలిపి పౌరసరఫరాలశాఖకు కోటీ 72లక్షలు కట్టారు. పేర్ని నాని బయటకొచ్చి బెయిల్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. అరెస్టులో అలవిమాలిన జాప్యంపై కూటమి పార్టీల శ్రేణుల నుంచి పెద్దఎత్తున విమర్శలు రావడంతో తూతూమంత్రంగా చర్యలు మొదలయ్యాయి. అయినా బెయిల్‌ వచ్చే వరకు పేర్ని నాని కుటుంబానికి చెందిన వారు దొరకరనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

రేషన్‌ బియ్యం మాయమైన వ్యవహారంలో వాటి విలువను లెక్కగట్టి జరిమానాతో సహా బాధ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. అయితే మాయమైన రేషన్‌ బియ్యం ఎక్కడకు చేరిందనేదే ఈ కేసులో ముఖ్యం. పోలీసులు ఆ దిశగా విచారించాలి. వాటిని కొనుగోలు చేసిన వారెవరో గుర్తించాలి. గోదాము నుంచి ఎప్పుడు, ఎక్కడకు తరలించారు? ఈ రేషన్‌ మాఫియాను నడిపించే వారెవరు? అనేది బయటకు తీయాలి. అయితే పోలీసుల విచారణ తీరు చూస్తుంటే ఇవన్నీ పట్టించుకుంటున్నట్లే లేదు. పౌరసరఫరాలశాఖ అధికారులు కూడా చేష్ఠలుడిగి చూస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో గోదాముల నుంచి నేరుగా బియ్యాన్ని ఎలా తరలించారో కారకులెవరో బట్టబయలు చేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

'పేర్ని నాని రెట్టింపు జరిమానా కట్టాలి- క్రిమినల్​ చర్యలు ఎదుర్కోవాలి'

ABOUT THE AUTHOR

...view details