Millets For Good Health : ఒక గ్లాసు రాగిజావ పోషకాలపరంగా చూస్తే మూడు గ్లాసుల పాలతో సమానమని, చిన్న పిల్లలకు రాగిజావ, జొన్నరొట్టె లాంటి మంచి పోషకాలను ఇప్పటి నుంచే అలవాటు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) డైరెక్టర్ సి.తారాసత్యవతి సూచించారు. హరిత విప్లవం మాదిరిగా దేశంలో చిరుధాన్యాల విప్లవం రావాలని అభిప్రాయపడ్డారు. ప్రతిఒక్కరు తమ రోజువారీ ఆహారంలో మూడో వంతు చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో భారత సైన్యానికి ఇచ్చే ఆహారంలోనూ 25 శాతం చిరుధాన్యాలను వినియోగిస్తోందని, ఈ చైతన్యం అన్ని రంగాల్లో రావాలని చెప్పారు. ఆదివారం(ఫిబ్రవరి 09న) ఐఐఎంఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థ(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం)లోనూ వీటిని చేర్చాలని సూచించారు. రైతులకు ప్రధాన పంటల కంటే చిరుధాన్యాల సాగు మరింత లాభదాయకమని డాక్టర్ తారాసత్యవతి వివరించారు.
దేశంలో చిరుధాన్యాల స్థితిగతులు ఎలా ఉన్నాయి?
మారుతున్న కాలంలో చిరుధాన్యాలపై ప్రజల్లో చైతన్యం కనిపిస్తోంది. సాగు కూడా పెరుగుతోంది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం తర్వాత వాటి ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించడం మంచి పరిణామం. వీటితో విభిన్న రకాల ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి కూడా వస్తున్నాయి. వాటి కొనుగోళ్లకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం మన దేశంలో 18 నుంచి 20 మిలియన్ టన్నుల మేర చిరుధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది.
ఆహార పరిశ్రమలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి?
ప్రజలకు చిరుధాన్యాలను రుచికరంగా, విభిన్న రూపాల్లో అందించడంలో ఆహార పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని చాలా వ్యాపార సంస్థలు మిల్లెట్స్తో చేసిన ఆహార ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. వరి, గోధుమలతో మధుమేహం, ఇతర సమస్యలొస్తున్నాయనే ఫిర్యాదులు ఇప్పటికే ఉన్నాయని తెలిసిందే. చిరుధాన్యాలతో లాభాలు తప్ప నష్టాలు అస్సలు లేవు. ఆరోగ్యపరంగా చూస్తే అన్నివిధాలా శ్రేష్ఠమైనవి. చిన్ననాటి నుంచే పిల్లలకు వీటిపై అవగాహన కల్పించాలి. ప్రభుత్వపరంగా చిరుధాన్యాల సాగుకు ప్రత్యేక డిపార్ట్మెంట్స్ ఉండాలి. ఇప్పటికే ఒడిశా సహా 12 రాష్ట్రాలు చిరుధాన్యాలపై ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో :తెలుగు రాష్ట్రాలు పూర్వం చిరుధాన్యాలకు ప్రముఖంగా పేరొందాయి. ప్రస్తుతం వాటి సాగు తగ్గింది. మళ్లీ పెద్ద ఎత్తున చిరుధాన్యాల సాగును చేపట్టాలి. గ్రామాల్లోని ప్రజలు మధుమేహం, మోకాళ్ల నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నారు. వాటికి అంతిమ పరిష్కారం చిరుధాన్యాలే. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, రైతులకు, వినియోగదారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు, అంకుర వ్యవస్థాపకులకు, యువతకు మా సంస్థపరంగా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తాం.