MLC Jeevan Reddy On Hydra: పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఎక్కడ అక్రమ కట్టడాలు కూల్చొద్దని చెప్పలేదన్న ఆయన అక్రమ నిర్మాణాల కూల్చివేతలో నిబంధనలు పాటించాలని మాత్రమే హైకోర్టు చెప్పిందని వివరించారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామన్న ఆయన అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రతి ప్రభుత్వం చేసేదేనని వెల్లడించారు.
బీజేపీ రైతు దీక్ష : ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తున్న బీజేపీ నగరం అంతా ప్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. బీజేపీ రైతు దీక్ష చేస్తుందా లేక ప్రచారం చేసుకుంటుందా అని ప్రశ్నించారు. బీజేపీ రైతుల కోసం దీక్ష చేయడమే ఆశ్చర్యంగా ఉందన్నారు. అసలు బీజేపీకి, రైతులకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించిన జీవన్ రెడ్డి కాషాయదళం పెట్టుబడిదారుల పార్టీ అని ఆరోపించారు.
10ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతు సంక్షేమం కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయాలన్న ఆలోచన కమలం నేతలకు ఎప్పుడూ చేయలేదని ఆరోపించారు. అంబానీ, అదానీ వంటి పెట్టుబడిదారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.6 వేలు మాత్రమే ఇస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్న ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మద్దతు ధరపైన బోనస్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రెండు సార్లు లక్ష రూపాయల రుణమాఫీ సరిగా చేయలేదని ఆరోపించారు. దీంతో అది కాస్తా వడ్డీ మాఫీ పథకంగా మారిందని ఆరోపించారు.