ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారా లోకేశ్ టూర్ అప్డేట్స్ - సత్య నాదెళ్ల, శంతను నారాయణ్‌తో భేటీ - NARA LOKESH AMERICA TOUR UPDATES

అమెరికాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన - రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస భేటీలు

Nara Lokesh America Tour
Nara Lokesh America Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 10:59 AM IST

Updated : Oct 29, 2024, 12:16 PM IST

Nara Lokesh Visit America Updates :రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్​ను సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లను మంత్రి ఆహ్వానించారు.

మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్​వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్​ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్​గా ఉందని సత్య నాదెళ్ల వివరించారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ 3.1 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ కలిగి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉందని చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్ రంగంలో బలమైన వృద్ధితో 211.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిందని సత్య నాదెళ్ల వెల్లడించారు.

'ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్​లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నాం. ఈ హబ్​లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని విజ్ఞప్తి చేస్తున్నాం. క్లౌడ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్​ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి తమ వద్ద అందుబాటులో ఉన్నాయి' అని లోకేశ్ తెలిపారు.

Lokesh Meet Satya Nadella :క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి తాము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నట్లు లోకేశ్​ స్పష్టం చేశారు. అగ్రిటెక్​కు ఏఐని అనుసంధానించడం వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఆకాంక్షించారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో భాగంగా స్ట్రీమ్ లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్​ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతో రాష్ట్రం వ్యాపార, వాణిజ్యరంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తెచ్చాం. ఏపీలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్​లకు అనువుగా ఉంటాయి. క్లౌడ్-ఆధారిత ప్లాట్ ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రోసాఫ్ట్ సహకారాన్ని కోరుతున్నాం' అని లోకేశ్ పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్​గా తయారు చేయాలని భావిస్తున్నామని లోకేశ్ వివరించారు. ఇందులో భాగంగా ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సత్య నాదెళ్లను ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు మైక్రోసాఫ్ట్ తెలుగు ఉద్యోగులు లోకేశ్​తో ఫొటోలు దిగారు.

యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఆహ్వానం : ఆ తర్వాత యాపిల్ సంస్థ ప్రతినిధులతోనూ లోకేశ్​ భేటీ అయ్యారు. శాన్​ఫ్రాన్సిస్కోలోని యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. భారత్‌లో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ ఆహ్వానం పలుకుతోందని లోకేశ్ తెలిపారు. ఈ మేరకు అవసరమైన మద్దతు ప్రభుత్వ తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్​లో నెలకొని ఉన్న 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో యాపిల్‌కు అనుకూలమైన ప్రాంతాన్ని అన్వేషించాలని కోరారు. సంస్థ కోరుకున్న చోట తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని లోకేశ్ వివరించారు.

ఏపీని గ్లోబల్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన మద్దతును అందిస్తుందని చెప్పారు. పన్నుల రాయితీ, ప్రోత్సాహకాలతో పాటు గ్లోబల్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించిన విధానాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని లోకేశ్ తెలిపారు.

Lokesh Meet Shantanu Narayen : అనంతరం శాన్​ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు ఏపీ అన్నివిధాలా అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. అడోబ్ కంపెనీ ప్రస్తుతం డిజిటల్ మీడియా, క్లౌడ్-ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉందని సీఈఓ శంతను నారాయణ్ పేర్కొన్నారు. ఫొటోషాప్, అక్రోబాట్, ఇల్లస్ట్రేటర్ వంటి సాధనాలను మరింత అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఏఐ-పవర్డ్ ఇన్నోవేషన్స్ రంగంలో ఎప్పటికప్పుడు అప్​డేటెడ్ వెర్షన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు. లోకేశ్ ప్రతిపాదనలపై కంపెనీ సహచరులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని శంతను నారాయణ్ తెలిపారు.

'ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ విజన్‌తో ఆడోబ్ చేస్తున్న కృషి ఏపీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విజన్‌తో సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్​లో ఈ-గవర్నెన్స్‌ని సమగ్రపర్చడం, గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నాం. డిజిటల్ విద్యా ప్లాట్‌ఫారంల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను ఏకీకృతం చేయడంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం' అని లోకేశ్ వెల్లడించారు.

అడోబ్ తరఫున సహకారం అందించాలి :ఏపీలో అడోబ్ ఆర్​అండ్​డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేశ్ విన్నవించారు. ఆంధ్రప్రదేశ్​ యువతను డిజిటల్ నైపుణ్యాలతో శక్తివంతం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. డిజిటల్ ఎడ్యుకేషన్​ను మెరుగుపర్చడంలో భాగంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌లను రాష్ట్రానికి తీసుకురావడానికి అడోబ్ తరఫున సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. డాక్యుమెంట్ ప్రొడక్టివిటీ, ఏఐ పవర్డ్ టూల్స్‌లో అడోబ్ నైపుణ్యం తమకు ఎంతగానో ఉపకరిస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.

డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, పబ్లిక్ సర్వీస్‌లను క్రమబద్ధీకరించడం, ప్రభుత్వ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ అమల్లో ఏపీ సర్కార్​తో కలసి పనిచేయాలని లోకేశ్ కోరారు. ప్రభుత్వం, పరిశ్రమల వినియోగానికి సంబంధించి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ప్రభుత్వ కార్యకలాపాలు, పౌరసేవల్లో క్లౌడ్ ఇంటిగ్రేషన్​కు అడోబ్ భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సేవలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ల్లో అడోబ్ ఏఐ ఆధారిత సేవలు, సృజనాత్మకత, డిజిటల్ అనుభవం ఏపీకి ఉపయోగపడతాయన్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లకు అడోబ్ యొక్క సృజనాత్మక సాధనాలు ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

టెస్లా ప్రధాన కార్యాలయంలో మంత్రి లోకేశ్ - పెట్టుబడుల వేటలో కీలక పరిణామం

గుడ్ న్యూస్ - త్వరలో విశాఖకు ఏవియేషన్‌ వర్సిటీ, డాటా సెంటర్‌!

Last Updated : Oct 29, 2024, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details