Minister Anam on Temple Lands : రాష్ట్రంలోని దేవాలయాలకు త్వరలో కొత్త పాలకమండళ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల నుంచే దేవాదాయశాఖలో ప్రక్షాళన మొదలైందని అన్నారు. భగవంతుడి ఆస్తుల రక్షణే తమ ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు. 27,127 ఆలయాల పరిధిలో 4.65 లక్షల ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. దేవాదాయశాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
Anam Take Charge Endowments Minister :అంతకుముందు ఆనం రామనారాయణరెడ్డి సచివాలయం రెండో బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్లో పూజలు నిర్వహించి దేవదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ క్రమంలోనే 160 దేవాలయాలను పునర్నిర్మించే దస్త్రంపై మంత్రి సంతకం చేశారు. దేవాదాయశాఖలో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాగళం, యువగళంలో వచ్చిన వినతులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. దేవాదాయశాఖలో అధికారుల పనితీరును మెరుగుపరుస్తున్నామని తెలిపారు. తప్పులు చేసిన వారిని వదిలేది లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరించారు.
ఆలయాల పవిత్రతకు భంగం కలగకుండా చూస్తాం : క్రమశిక్షణ చర్యల్లో భాగాంగా నెల్లూరు జిల్లాలో ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నామని మంత్రి ఆనం చెప్పారు. మరో వివాదాస్పద మహిళఆ అధికారిపై విచారణ జరుగుతోందన్నారు. ఆలయాల పవిత్రతకు భంగం కలగకుండా చూస్తామని పేర్కొన్నారు. రూ.50,000 దిగువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థికసాయం పెంచుతామని వెల్లడించారు. ధూప, దీప నైవేద్యాలకు ఇస్తున్న సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచనున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.