Migration Increased In Kurnool Due To Drought: నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. బాగా చదువుకున్న విద్యార్థులే బలమైన దేశాన్ని నిర్మించగలరు అనేది నానుడి. కానీ కళ్లముందే విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న దుస్థితి కనిపిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చదువు కోసం కోట్లు ఖర్చుచేస్తున్నామని, నాడు- నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని, ఆంగ్ల బోధనతో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని, అమ్మఒడి, ట్యాబులు ఇస్తున్నామని, ఆన్లైన్ విద్యతో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఏవీ కానరావటం లేదు. విద్యార్థులే లేని పాఠశాలల్లో ఎన్ని వసతులు కల్పిస్తే ఏం ప్రయోజనం మేనమామా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి కర్నూలును అల్లాడిస్తున్న కరవు - తాగునీటికి ప్రజలు మూగజీవుల అవస్థలు
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి దశాబ్దాలుగా కరవుతో అనుబంధం ఉంది. ఈసారి ముందుగానే వచ్చిన కరవు పెను భూతంలా గ్రామాలను చుట్టుముట్టింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్లో వేసిన పంటలన్నీ మట్టిలోనే కలిసిపోయాయి. ప్రతి రైతూ లక్షల్లో అప్పులపాలై ఏం చేయాలో దిక్కు తోచని స్థితి నెలకొంది. భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోయి బోరు బావులు నోళ్లు తెరిచాయి. కనీసం పశువులకు నీరు దొరికే పరిస్థితి సైతం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, వేరుశెనగ, మిరప, ఆముదం, మొక్కజొన్న, శెనగ, వరి తదితర పంటలు సాగు చేస్తారు. ఖరీఫ్లో పంటలేవీ చేతికి అందలేదు. రబీలో కర్నూలు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1.21 లక్షల హెక్టార్లు కాగా కేవలం 14 వేల హెక్టార్లు మాత్రమే సాగైంది. నంద్యాల జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1.81 లక్షల హెక్టార్లు కాగా కేవలం 27 వేల హెక్టార్లు మాత్రమే సాగైంది. మొత్తంగా రబీలో 15 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. అవి కూడా నీటి ఆధారంగా వేసిన పంటలే కావటం గమనర్హం. బోరు బావులు సైతం అడుగంటిపోతుండటంతో వేసిన పంటలు చేతికి రాలేదు. దీంతో రైతులు, రైతు కూలీలు కుటుంబాలతో సహా వలసబాట పట్టారు.
ఈ ఏడాది జిల్లాలో రెండు విడతలుగా వలసలు వెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. నాలుగు నుంచి ఆరు నెలలపాటు ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. తొలి విడతలో భాగంగా ఆగస్టు నెలలోనే చాలా మంది వెళ్లారు. వీరు జనవరి వరకు పనులు చేసుకుని సంక్రాంతికి ఊళ్లకు వచ్చారు. రెండో విడతలో భాగంగా జనవరి నెలలో సంక్రాంతి తర్వాత భారీగా వలస వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది తమతో పాటు తమ పిల్లలను సైతం వలసలకు తీసుకువెళ్లిపోయారు. పని చేయగలిగిన పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లారు. దీని ప్రభావం విద్యార్థుల జీవితాలపై అధికంగా పడుతోంది.