Major MR Gopal Naidu From Srikakulam District Awarded Kirti Chakra :జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద జరిగిన పోరులో ఉగ్రవాదులను మట్టుబెట్టి, తన తోటి సైనికుల్ని రక్షించుకోవటంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు ఈ మేజర్. అందుకు గానూ అతను అరుదైన అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 15న ఈ పురస్కారాలు ప్రకటించగా త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా రాంగోపాల్ నాయుడు ఈ కీర్తిచక్ర అవార్డు అందుకోనున్నారు.
మేజర్ రాంగోపాల్ వ్యూహాత్మక ఆలోచన, ధైర్యసాహసాలతో దళాలను కాపాడుకోవడంలో చేసిన కృషికి గాను ఆయన్ను అర్మీ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మక శౌర్యపతకాల్లో రెండోదైన కీర్తిచక్రకు ఎంపిక చేశారు. 2023 అక్టోబరు 26 ఉదయం 10గంటల సమయంలో జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారన్న సమాచారంతో ఆర్మీ మేజర్ రాంగోపాల్ నాయుడు నేతృత్వంలో మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ 56వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు మెరుపు వేగంతో రంగంలోకి దిగారు. కుప్వారాలో మాటువేసి ఐదుగురు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు.
కాల్పులు, ఎదురు కాల్పులతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఓ ఉగ్రవాది గుహలో నక్కి భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రయత్నించారు. ముష్కరులు భారత సైన్యంపై గ్రెనేడ్ విసరడాన్ని గమనించిన మేజర్ రామ్గోపాల్ నాయుడు ప్రాణాలు లెక్కచేయకుండా, రెప్పపాటుకాలంలో పెను ప్రమాదం నుంచి సైన్యాన్ని కాపాడి. అనంతరం ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఇద్దరు ఉగ్రవాదులను నేరుగా హతమార్చి భారత జవాన్లను రక్షించుకోవడంలో అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు కేంద్రం ఆయన్ను కీర్తిచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారానికి ఎంపికైన నలుగురిలో రామ్ గోపాల్ ఒక్కరే సజీవంగా ఉన్నారు.