గుట్ట ముద్దు మైనింగ్ వద్దు - ఇకనైనా ఆపండి : గ్రామస్థులు (ETV Bharat) Mailaram Village People Against Mining :నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో మైనింగ్కు అనుమతులివ్వడాన్ని నిరసిస్తూ గ్రామస్థుల పోరాటం కొనసాగుతోంది. ఇప్పటికే గుట్టముద్దు- ఓటువద్దు అంటూ లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ దూరంగా ఉన్న గ్రామస్థులు, స్థానిక సంస్థల ఎన్నికలకూ దూరంగా ఉండేందుకు సమాలోచన చేస్తున్నారు. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టను క్వార్ట్జ్ తవ్వకం కోసం 2021లో ఓ ప్రైవేటు సంస్థకు మైనింగ్ శాఖ లీజుకిచ్చింది.
సదరు సంస్థ గతంలో గుట్టపై మైనింగ్ చేపట్టేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా గ్రామస్ధులు అడ్డుకున్నారు. అక్రమంగా మైనింగ్కు అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గ్రామంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో చివరకు గ్రామంలోని 786 మంది ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్కు దూరంగా ఉన్నారు. అంతేగాక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకూ దూరంగా ఉండాలని సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
'గత 12 సంవత్సరాల నుంచి కొందరు మా గుట్టపై మైనింగ్ చేయడానికి ప్రయత్నించారు. గ్రామంలో మైనింగ్ చేయొద్దని ఎంపీ ఎన్నికలను కూడా మేం అందరం బహిష్కరించాం. దీనిపై నిరంతరం పోరాడుతాం. వచ్చే స్థానిక ఎన్నికలనూ కూడా బహిష్కరిస్తాం'- స్థానికులు
గుట్టపై మైనింగ్ చేపడితే పర్యావరణ కాలుష్యం సహా ఊరికి నష్టం : మైలారం గ్రామానికి దాన్ని అనుకున్న ఉన్న గుట్టకు విడదీయరాని బంధం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ గుట్టను ఆనుకునే 50 నుంచి 100కు పైగా నివాసాలుంటాయి. గుట్ట తవ్వకం పనులు చేపడితే తాము ఇళ్లను కోల్పోతామని గ్రామస్థులు అంటున్నారు. గుట్ట సమీపంలోనే ప్రభుత్వం నిర్మించనున్న ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం చెరువుకు ఆనుకునే ఉంది. మొత్తంగా గుట్టపై మైనింగ్ చేపడితే పర్యావరణ కాలుష్యం సహా ఊరికి నష్టం జరుగుతుందనేది గ్రామస్థుల వాదన.
మైనింగ్ను స్థానిక ప్రజలు వ్యతిరేస్తున్నారని, దీంతో అనుమతులు రద్దు చేయాలని ఉన్నతాధికారులు, మైనింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అచ్చంపేట ఆర్డీఓ మాధవి తెలిపారు. లోక్సభ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయానికి రావడం లేదని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాతైనా మైనింగ్ అనుమతులు రద్దు చేసి అక్రమ మైనింగ్ నుంచి మైలారం గ్రామాన్ని రక్షించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. లేదంటే తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
'మైలారానికి సంబంధించి నాలుగేళ్ల క్రితం గత తహసీల్దార్ రికమెండేషన్ కింద మైనింగ్ వాళ్లు వచ్చారు. కానీ ఇప్పుడు ప్రజలు దానికి ఆందోళన వ్యక్తం చేయడంతో నేను ఎన్నికల పరంగా రెండుసార్లు అక్కడికి వెళ్లాను. మైనింగ్ చేయొద్దు మాకు అన్యాయం జరిగిందని గ్రామస్థులు చెప్పారు. దీంతో నేను తహసీల్దార్కు చెప్పా. ఆయన వెంటనే మైనింగ్పై గ్రామస్థులకు సుముఖంగా లేరని రిపోర్ట్ రాశారు. దానికి మైనింగ్ వాళ్లకు కూడా స్పందించారు'- మాధవీ, అచ్చంపేట ఆర్డీఓ
'గుట్ట ముద్దు - ఓటు వద్దు' అంటున్న గ్రామస్థులు - లోక్సభ ఎన్నికలకు బహిష్కరణకు ఊరంతా సిద్ధం - MAILARAM VILLAGE BOYCOTT ELECTIONS