AP Wine Shop Tenders 2024 : రాష్ట్రంలో ఐదు సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చిన నూతన మద్యం పాలసీ వ్యాపారుల్లో కిక్కు పెంచింది. లాటరీలో వైన్ షాప్ ఒకటి తగిలితే చాలు పరపతి పెంచుకోవచ్చనేది చాలా మంది భావన. ఆ అవకాశం దక్కించుకోవడానికి రాజకీయ నాయకుల నుంచి దిగువస్థాయి దళారుల వరకు ప్రస్తుతం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. దరఖాస్తు దాఖలుకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో జిల్లాల్లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యాపార వాంఛ, రాజకీయ కాంక్షల మధ్య మధ్యవర్తులు రాయబారాలు జరుపుతున్నారు.
నేతల వారసుల జోక్యం :పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేల వారసులు మద్యం దరఖాస్తుల విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. వారికి తెలియకుండా అర్జీలు చేయకూడదని హుకుం జారీ చేసినట్లు వ్యాపారులు వాపోతున్నారు. తీరప్రాంత ఎమ్మెల్యే ఒకరు కనీసం పది దుకాణాలు తనకు వదిలేయాలని కోరుతున్నారు. మరో నాయకుడు తన పరిధిలోని దుకాణాలన్నిట్లోనూ 20 శాతం వాటా అడుగుతున్నారని చెబుతున్నారు. 10 శాతానికైతే సరేనన్న సంకేతాలు మధ్యవర్తుల ద్వారా వారికి చేరాయి.
సిండికేట్లు ఏర్పాటు :గతంలో రూ.50,000 తిరిగిరాని డిపాజిట్గా ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తం రూ.2 లక్షలకు పెరిగింది. దీంతో ఎక్కువ దరఖాస్తుల దాఖలంటే అయ్యేపనికాదని వ్యాపారులు సిండికేట్గా ఏర్పడుతున్నారు. సిండికేట్ నుంచి కనీసం 20 అర్జీలు తక్కువ కాకుండా వేసేందుకు సిద్ధమయ్యారు. ఏ ఒక్కరికి లాటరీలో దుకాణం వచ్చినా అందరికీ వాటాలుండేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రతిపక్ష నేతలు సిండికేట్లో సభ్యులవుతున్నారు.