Krishna River Munneru Flood Receded :ఆంధ్రప్రదేశ్లోనిఉమ్మడి కృష్ణాజిల్లాలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద మిగిల్చిన నష్టాన్ని చూసి రైతులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మున్నేరు వరద ఉద్ధృతికి లింగాల వంతెన కొట్టుకుపోయింది. కిలోమీటర్ పొడవైన వంతెనపై పలుచోట్ల భారీగండ్లు ఏర్పడ్డాయి. కాంక్రీట్ స్లాబులూ కోతకు గురయ్యాయి. దీంతో జగ్గయ్యపేట నుంచి ఖమ్మంకు రాకపోకలు నిలిచిపోయాయి.
జగ్గయ్యపేట-ముత్యాల రహదారిలోని పాలేటి వంతెనపై వరద ప్రవాహానికి భారీ రంధ్రాలు ఏర్పడ్డాయి. వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద వైరా కట్టలేరు వరద ఉద్ధృతికి రహదారులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ నుంచి మున్నేరుకు వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో ఐతవరం వద్ద పొలాల్లో కొట్టుకుపోయిన కార్లు, వాహనాలు బయటపడుతున్నాయి. ఒక్కో వాహనాన్ని బయటకు తీసేందుకు రూ.20 వేల వరకు ఖర్చవుతుందని యజమానులు వాపోతున్నారు.
Roads Eroded Due to Flood Flow :నందిగామ మండలం కంచల గ్రామానికి వెళ్లే రోడ్డు కొంత భాగం కొట్టుకుపోయింది. రాఘవపురంలో రోడ్డు మొత్తం కోతకు గురైంది. వరి పొలాలు నీట మునిగాయి. చందర్లపాడు మండలం చింతలపాడుకు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. భారీగా వరద నీరు రావడంతో తోటరావులపాడు నుంచి చింతలపాడు వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. గంపలగూడెం మండలం వినగడప వంతెన వద్ద కట్టలేరుకు వరద ప్రవాహం ఉద్ధృతిగా సాగుతోంది.
కంచికచర్ల మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని తెలుగుదేశం నేత నెట్టెం రఘురాం సందర్శించారు. ఆహార ఏర్పాట్ల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 10 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. వరదలకు దివిసీమలో వాణిజ్య, ఆక్వాపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో అరటి, కంద, పసుపు, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి.