తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ హోర్డింగులు అందరికీ కనిపిస్తాయి - ఒక్క ఆ అధికారులకు తప్ప! - ILLEGAL HOARDINGS UNDER GHMC

ఐదు పైవంతెనలపై ఏళ్లుగా అక్రమ హోర్డింగులు - పట్టించుకోని జీహెచ్​ఎంసీ అధికారులు - ట్రాఫిక్‌ కంట్రోల్ రూముల పేరుతో రూ.కోట్లకు గండి

Illegal Hoardings Under GHMC Premises
Illegal Hoardings Under GHMC Premises (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 2:12 PM IST

Illegal Hoardings Under GHMC Premises :పైవంతెనలపై ఉన్న హోర్డింగులు కంటి చూపు ఉన్న ప్రతి ఒక్కరికీ కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీకి మాత్రం కనిపించవు. సైబర్‌ టవర్స్‌ చౌరస్తా, బయో డైవర్సిటీ కూడలి పైవంతెనలపై ఇరువైపులా కలిపి నాలుగు అనుమతి లేని హోర్డింగులు నాలుగేళ్లుగా ఉన్నాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్, బషీర్‌బాగ్, ఆర్కేపురం పైవంతెనలకు రెండేసి చొప్పున, ఆర్‌కే పురం వంతెనకు ఒకటి కలిపి ఐదు హోర్డింగులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. కోర్టు కేసుల పేరుతో జీహెచ్‌ఎంసీ వాటిని పరోక్షంగా ప్రోత్సహిస్తోందన్న విమర్శలున్నాయి.

ఖైరతాబాద్​, జూబ్లీహిల్స్​ తదితర ప్రాంతాల్లోని విభాగినులపై లాలిపప్​ ప్రకటన బోర్డుల ఏర్పాటుపై కేసునూ తేల్చట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు మారుతున్నా గానీ దాదాపు 15 ఏళ్లుగా ఆయా కేసులపై సరైన వాదనలు వినిపించి, పరిష్కారం చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దశాబ్ద కాలంగా కేసులు అపరిష్కృతం :రహదారులకు ఇరువైపులా, భవనాలపై, రోడ్డు విభాగినులపై ప్రకటనల బోర్డులను ఐదేళ్ల కిందటే ప్రభుత్వం నిషేధించింది. అయినా జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి రోడ్డు, లక్డీకాపూల్‌ నుంచి మాసబ్‌ట్యాంకు వెళ్లే రోడ్డు, ఐమాక్స్‌ రోడ్డు విభాగినులపై లాలిపప్‌ ప్రకటన బోర్డులు కనిపిస్తున్నాయి. బోర్డులపై అడిగితే వాటికి సంబంధించి కేసు విచారణలో ఉందని అధికారులు చెబుతున్నారు. మరో మూడు పైవంతెనలపై ఏర్పాటైన హోర్డింగులకూ అదే సమాధానం. ఆయా కేసులు దశాబ్ద కాలానికిపైగా అపరిష్కృతంగా ఉండటంతో బల్దియాపై విమర్శలొస్తున్నాయి.

ప్రకటనలు, దుకాణాలతో నిండిన ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం వద్దనున్న ఏసీ బస్టాపు (ETV Bharat)

పేరుకి మాత్రమే : ఒకప్పుడు కూడళ్లలో ట్రాఫిక్‌ పోలీసులకు చెందిన గొడుగుల్లాంటి నిర్మాణాలు కనిపించేవి. వాటిపై ప్రకటనలూ ఉండేవి. మా రోడ్లపై మీరు ప్రకటనలు ఏంటని 2020లో జీహెచ్‌ఎంసీ కొత్త విధానాన్ని తెచ్చింది. కూడళ్లలో పోలీసులకు చిన్న కార్యాలయం, కుర్చీలు, వైఫై, ఇతర సదుపాయాలతో కూడిన 700 ట్రాఫిక్‌ కేంద్రాలను ఏర్పాటుకు టెండర్లను పిలిచింది. యాడ్‌ ఏజెన్సీలు అరకొరగానే పెట్టాయి. 90శాతం గతంలో ట్రాఫిక్‌ పోలీసులు ఉపయోగించుకున్నవే. ఒక్కో కేంద్రం నుంచి యాడ్‌ ఏజెన్సీలు నెలకు రూ.30వేల నుంచి రూ.40వేలు వసూలు చేస్తున్నాయి.

అమలు కాని టెండర్ల నిబంధనలు :ఉచిత వైఫై, ఫోన్‌ ఛార్జింగ్, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలతో ఏసీ బస్టాపులను నిర్మించుకుని, వాటిలో ఓ దుకాణాన్ని, ప్రకటన బోర్డులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చన్న టెండరు నిబంధన కూడా అమలు కావట్లేదు. ప్రారంభమైన రెండో ఏడాది నుంచే ఏసీలు నిలిచిపోయాయి. మరుగుదొడ్లు ప్రారంభమేకాలేదు. వసతుల్లేవు. విచ్చల విడిగా ప్రకటనలు, దుకాణాల ఏర్పాటుతో ఏజెన్సీలు ఆదాయం పొందుతున్నాయి. ఈ వేసవికైనా ఏసీ బస్టాపులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ప్రజలు జీహెచ్‌ఎంసీని కోరుతున్నారు.

రెండేళ్లయినా పనులు ప్రారంభించకపోతే? - కమిషనర్‌ ఉత్తర్వుతో ఇంజినీర్ల హడల్‌

గ్రేటర్​లో చెత్త తీసుకెళ్లేందుకు రోబోలొచ్చాయ్ - అవి ఎలా పని చేస్తాయో తెలుసా?

జీహెచ్‌ఎంసీ హద్దులు మారనున్నాయా? - ఓఆర్‌ఆర్‌ లోపల విలీనాలు ఖాయమేనా?

ABOUT THE AUTHOR

...view details