Wines Closed Due to Ganesh Immersion : బొజ్జ గణపయ్య నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్నింటికీ రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ ఊరేగింపులు సజావుగా ముగిసేందుకు ధైర్యంగా, స్వేచ్ఛగా పనిచేయాలని సీవీ ఆనంద్ అధికారులను సూచించారు. గురువారం సౌత్-ఈస్ట్ జోన్ను, ఈస్ట్ జోన్ను సందర్శించిన ఆయన, అధికారులతో సమావేశమయ్యారు.
సున్నితమైన ప్రాంతాలు రెండు జోన్లలో ఉన్నాయని సీవీ ఆనంద్ అధికారులకు వివరించారు. కమ్యూనల్ రౌడీలు, ఇతర సంఘ విద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. మరోవైపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17, 18న లింగంపల్లి, ఫలక్నుమా, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి రాత్రి, ఉదయం రైళ్లు నడుపనున్నట్లు పేర్కొంది.
తెలంగాణ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఊరువాడల్లో గణనాథుడి మండపాలు ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. గణేశ్ మండపాలు విద్యుత్ కాంతులతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. వివిధ రూపాల్లో కొలువుదీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు గణనాథుల నిమజ్జనం ఉత్సాహంగా సాగుతోంది. గణనాథులను వాహనాలపై ఊరేగిస్తూ వైభవంగా నిమజ్జనం చేస్తున్నారు.