Heavy Rains in Andhra Pradesh : అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. అనేక ప్రాంతాల్లో మురుగునీరు కాలనీలు, రోడ్లపైకి చేరడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు : ప్రకాశం జిల్లాలో శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఖరీఫ్లో పంటలకు జీవం పోస్తున్నాయి. ఒంగోలులో భారీ వర్షానికి అనేక కాలనీలు జలమయమయ్యాయి. కర్నూలు రోడ్డు, సాయిబాబా గుడి ప్రాంతాల్లో మోకాళ్లలోతు మురుగునీరు రోడ్డు మీద ప్రవహిస్తోంది. పోతురాజు కాలువ పొంగి ప్రవహిస్తోంది. జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
తడిసి ముద్దయైన కడప జిల్లా : అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు కడప నగరం కడిసి ముద్దయింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం చెరువులా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండు రోడ్డు, లోహియానగర్, అల్లూరి సీతారామరాజు నగర్, నంద్యాల నాగిరెడ్డి కాలనీ సహా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది.
ఏలూరులో నీట మునిగిన కర్రల వంతెన : శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఏలూరులోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం, ఆర్ఆర్ పేట ప్రధాన రహదారి, పవర్ పేట రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలిచింది. కర్రల వంతెన వద్ద ఈదురు గాలులకు చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై పడింది. వర్షాల కారణంగా జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించగా, ఇవాళ నిర్వహించాల్సిన అనేక పరీక్షలను సెప్టెంబరు 6కు వాయిదా వేశారు.