TGPSC Group-1 Mains Exams From Today :నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఉత్కంఠగా మారిన గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేయటం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించటంతో మెయిన్స్కు ఉన్న అవాంతరాలు తొలగినట్టైంది. పరీక్షకు మొత్తం 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించిన అధికారులు, 1:30 గంటలకు గేట్లు మూసివేశారు. ఆలస్యంగా వచ్చిన పలువురిని ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. దీంతో పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎగ్జామ్ రూమ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు. పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలను జీపీఎస్ ట్రాకింగ్ అమర్చిన వాహనాల్లో తరలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో నిర్దేశిత మార్గాల్లోనే ఆ వాహనాలు ప్రయాణించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.