Telangana Crime News :నలుగురు స్నేహితులు. వారంతా శ్మశానవాటికలో శవాలు కాల్చిన తర్వాత బూడిదలో బంగారం, వెండి కోసం వెతుకుతుంటారు. అయితే వీరిలో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ కేసులను ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు రెండు హత్యల మిస్టరీని ఛేదించి, హత్య చేసింది మిగిలిన ఇద్దరు స్నేహితులని తేల్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ హత్యలకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ నగరంలోని ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ రాజావెంకట్ రెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ నగరంలోని మహమ్మదీయ కాలనీకి చెందిన అమర్ఖాన్, రియాజ్ఖాన్, అలాగే ఆటోనగర్కు చెందిన మహమ్మద్ బహదూర్, బాబన్సాహబ్ పహాడ్కు చెందిన దివ్యాంగుడు సయ్యద్ యూసుఫ్ నలుగురు స్నేహితులు. వీరి వృత్తి శ్మశానవాటికలో శవాలు కాల్చిన తర్వాత బూడిదలో బంగారం, వెండి కోసం వెతకడం. ఈ నెల 18న వీటి కోసం అమర్ఖాన్, రియాజ్ఖాన్, మహమ్మద్ బహదూర్ ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై ఆర్మూర్ రోడ్డులోని నిజాం సాగర్ కెనాల్కు ఆనుకొని ఉన్న శ్మశానవాటికకు వెళ్లారు.
అక్కడి శ్మశానవాటికలో బూడిదను సేకరించి నీటిలో కడగగా వారికి ఏమీ దొరకలేదు. ఈ క్రమంలో మద్యం తాగి అక్కడి నుంచి గూపన్పల్లి శ్మశానవాటికకు వెళ్లారు. అక్కడ వెళ్లి వెతికినా ఏమీ లభించలేదు. దీంతో రూ.1000 ఖర్చు చేసినా ఏమీ దొరకలేదని వారి మధ్య గొడవ జరిగింది. దీంతో అమర్ఖాన్, రియాజ్ఖాన్ కలిసి పక్కనే ఉన్న కర్ర తీసుకున్నారు. గొడవలో బహదూర్ తలపై కొట్టారు. ఇలా కొట్టడంతో అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని పులాంగ్ వాగులో తోసేశారు.