Fraud in the Name of Government Jobs:ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎరవేసి నిరుద్యోగుల నుంచి ఓ ఐదుగురు సభ్యుల ముఠా లక్షలు దండుకున్న ఘటన ఏలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జంగారెడ్డిగూడెం పరిసర మండలాలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు నిరుద్యోగులు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని లబోదిబోమంటున్నారు. నిరుద్యోగులు ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేశారు.
రైల్వే టీసీ ఉద్యోగం:జంగారెడ్డిగూడెంలోని పుట్లగట్లగూడానికి చెందిన ఇబ్బ యామలరావు అనే వ్యక్తికి రైల్వే టీసీ ఉద్యోగమని 7,35,000 కాజేశారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయం వద్ద కొద్దిరోజుల శిక్షణ కూడా ఇచ్చారు. టీసీ యూనిఫామ్ కూడా వేయించి కార్యాలయం బయట మెట్ల మీద తిప్పేవారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినా ఉద్యోగంలో చేరేందుకు సమయం పడుతుందని చెప్పడంతో అనుమానం వచ్చిన ముఠా సభ్యులను యామలరావు నిలదీయడంతో వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే చాలాకాలం నుంచి వారి వెనక నగదు కోసం ఎంత తిరిగినా ఫలితం లేదని యామలరావు వాపోయారు.
ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం: అదే గ్రామానికి చెందిన కర్నాటి రాశి అనే యువతికి ప్రభుత్వం బ్యాంకులో ఉద్యోగం పేరుతో 7 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి నిరుద్యోగులను, మోసగాళ్లు బురిడీ కొట్టించారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినా బ్యాంకు నుంచి ఎటువంటి కబురు రాకపోవడంతో ముఠా సభ్యులను ఆమె నిలదీసింది. దీనితో ఆమె లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం వెలుగు చూసింది.
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం - డబ్బులు తీసుకున్నాక పత్తా లేని లైఫ్ లైన్