Farmers Suffering Due to Lack of Cold Storage in Joint Guntur District :కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు కోసం రైతన్నలు ఆ పంటను ప్రైవేట్ శీతల గోదాములలో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పులు చేసి సాగు చేసిన పంటకు ఈ అదనపు ఖర్చును తగ్గించేందుకు గత టీడీపీ ప్రభుత్వమే గోదాముల నిర్మాణానికి పూనుకుంది. అయితే వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అడుగు ముందుకు పడకపోవడంతో ఒక్క గోదాము కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో కర్షకులు పంటను నిల్వ చేసేందుకు ఆర్ధికంగా విలవిల్లాడిపోతున్నారు.
TDP Initiative for Construction of Cold Warehouses Across the State : పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి ఉద్దేశించిన శీతల గోదాముల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు గిట్టుబాటు దక్కేదాకా ఈ గోదాముల్లో నిల్వ చేసుకునేలా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెుత్తంగా 13 శీతల గోదాముల నిర్మాణాలను చేపట్టింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, దుగ్గిరాలలో నిర్మాణానికి నిధులు కేటాయించింది. వీటికి సంబంధించి నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పటి వరకు చేపట్టిన పనులు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శీతల గోదాముల నిర్మాణం పిల్లర్ల దశలో ఆగిపోయింది.
'గుంటూరు యార్డ్కు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే కాక పరిసర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా రైతులు పంటతో వస్తుంటారు. ఎంతో కీలకమైన ఈ గోదామును సైతం వైఎస్సార్సీపీ సర్కార్ పూర్తి చేయకుండా వదిలేసింది. నరసరావుపేట మార్కెట్ యార్డ్లో నిర్మాణం ప్రారంభించిన శీతల గోదాము కూడా పిల్లర్ల దశలో ఉండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసింది. చిలకలూరిపేట, దుగ్గిరాల శీతల గోదాములు ఇంకా పునాదుల్లోనే ఉండిపోయాయి.' -శివాజీ, ప్రధాన కార్యదర్శి, జిల్లా రైతు సంఘం