Excise Department Notification for Bar Licenses in AP:రాష్ట్రవ్యాప్తంగా 53 బార్ లైసెన్సుల జారీకి అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడాది కాలపరిమితితో ఉన్న లైసెన్సులకు నోటిఫికేషన్ ఇస్తున్నట్లు అబ్కారీ శాఖ తెలిపింది. 2024 డిసెంబరు 1 నుంచి 2025 ఆగస్టు 31 తేదీ వరకూ 53 బార్ల లైసెన్సులకు వేలం వేయనుంది. ఈ-వేలం, ఆన్ లైన్ లాటరీ విధానంలో బార్లను ఎక్సైజ్ శాఖ కేటాయించనుంది.
ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమై 22వ తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. 50 వేల జనాభా వరకూ రూ.5 లక్షల నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము ఉంటుందని 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా వరకూ ఉన్న ప్రాంతాలకు రూ.7.5 లక్షల దరఖాస్తు రుసుము ఉంటుందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇంక 5 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.10 లక్షల దరఖాస్తు రుసుము నిర్ధారించినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు.
ప్రొవిజినల్ లైసెన్సులు జారీ:రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఇటీవలే ఎక్సైజ్ శాఖ ప్రొవిజినల్ లైసెన్సులు జారీ చేసింది. ఈ క్రమంలో పలుచోట్ల దుకాణాలు ప్రారంభమయ్యాయి. అవి నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా లేదా అని పరిశీలించి ఎక్సైజ్ అధికారులు రెగ్యులర్ లైసెన్సులు జారీ చేశారు.