Pawan Kalyan visit Temples in Tamil Nadu:ఆలయాల సందర్శనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం ఆయన కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. అక్కడ కుమారస్వామిని దర్శించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద ఆశీర్వచనం పొందారు. పవన్ పర్యటనలో ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. స్వామిమలైలో స్థానిక బీజేపీ నేతలు పవన్ను కలిశారు.
శ్రీ ఆదికుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు:స్వామిమలై ఆలయం దర్శనానంతరం శ్రీ ఆది కుంభేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం మేరకు పవన్ కల్యాణ్ ఆదివినాయకుని మొదట అర్చించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత భాంఢం ఆకారంలో ఉన్న శివలింగ విశిష్టతను అర్చకులు తెలియజేశారు. పంచ హారతులు ఇచ్చి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు. పవన్ కల్యాణ్తో ఆయన తనయుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి స్వామి వారిని దర్శించుకున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న పవన్ పూజలు నిర్వహించారు. అనంతరం అదే ప్రాంగణంలో ఉన్న అగస్త్య ధ్యాన పీఠ మందిరాన్ని సందర్శించారు. కూర్చుంటే తెలియకుండానే ధ్యాన ముద్రలోకి వెళ్లిపోతారని ధ్యాన మందిర విశిష్టతను అర్చకులు పవన్ కల్యాణ్కు వివరించారు. ఆలయ ఆస్థాన ఏనుగుకు అరటి పళ్లు అందించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. నాలుగు సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం వేచి చూస్తున్నానని ఇప్పటికి ఆ మురుగన్ అనుగ్రహం లభించడంతో క్షేత్ర దర్శనం చేసుకోవడానికి వచ్చినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.