Secunderabad Railway Station Demolition : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తుకు వచ్చే భవన నమూనా ఇక కనుమరుగుకానుంది. రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకంలో ఈ స్టేషన్ను చేర్చింది. ఆధునికీకరణ కోసం పనులు చేస్తున్న నేపథ్యంలో పురాతన కట్టడాలను అధికారులు కూల్చి వేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రధాన ఆకర్షణగా నిలిచే భవన నిర్మాణాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మించనున్నారు.
అమృత్ భారత్ స్కీం ప్రకారం ఆధునీకికరణ : సికింద్రాబాద్ అనగానే ముందుగా మనకు తట్టే పాత భవనాలు ఇంకో రెండు రోజుల్లో మొత్తం కనుమరుగుకానున్నాయి. కూల్చివేసే క్రమంలో సికింద్రాబాద్కు తలమానికంగా ఉండే రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అన్ని రకాల జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకుంటూ పాత భవనాలను కూల్చి వేస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పలు సినిమాలలో కూడా దర్శకులు చూపించారు. కానీ ప్రస్తుతం ఆ భవనం చరిత్రలో ఉండేదని చెప్పుకోవాల్సిందే మరీ.