Couple Committed Suicide: కృష్ణా జిల్లా గుడివాడ వాసవి నగర్లో విషాదం చోటు చేసుకుంది. 5 వందల కోసం దంపతుల మధ్య వివాదం తలెత్తి భార్యాభర్తలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త కొలుసు రాంబాబు(45), బార్య కనకదుర్గ (40) మృతి చెందారు. స్వల్ప విషయానికే భార్యాభర్తలు మరణించడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో వాసవి నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి.
ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న కొలుసు రాంబాబు, భార్య కనకదుర్గ కుటుంబ సభ్యులతో కలిసి వాసవి నగర్లో నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన రాంబాబు పలుచోట్ల ఉద్యోగం కోల్పోయాడు. ప్రస్తుతం ఏలూరులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నారు.
మద్యానికి 5 వందలు కావాలని భార్యను అడగగా తన దగ్గర లేవని చెప్పడంతో ఇరువురి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడిన రాంబాబు ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకోగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తండ్రి మరణించిన విషయాన్ని తల్లి కనకదుర్గకు కుమారుడు ఫోన్ చేసి చెప్పాడు. మనస్థాపానికి గురైన కనకదుర్గ ఇంట్లోనే ఉరి వేసికొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి కనకదుర్గ ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. రోజూ కళ్ల ముందు తిరిగాడే దంపతులు ఇద్దరూ మరణించడంతో వాసవి నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.