తెలంగాణ

telangana

వేలాది మంది ఉపాధ్యాయుల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు : సీఎం రేవంత్ రెడ్డి - CM revanth met with Teachers

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 6:22 PM IST

CM Revanth Reddy Public Meeting Today : వేలాది మంది ఉపాధ్యాయుల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు ఉందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుందని అడిగితే ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానని అన్నారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా విద్యుత్​ పంపిణీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

CM Revanth Reddy Public Meeting Today
CM Revanth Reddy Public Meeting Today (ETV Bharat)

CM Revanth Face to Face with the Promoted Teachers : 'కాంగ్రెస్​ ప్రభుత్వ ఏర్పడడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను కలవాలని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాం.కోదండరామ్​కు విజ్ఞప్తి చేసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయించాం. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుందని అడిగితే ఎల్బీ స్టేడియంలోని ఉందని చెప్తాను. వేలాది మంది ఉపాధ్యాయుల చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు ఉంది. తమ పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఇచ్చారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపే ఉంది. తెలంగాణ ఉద్యమంలో టీచర్లు పోషించిన పాత్ర మరువలేనిది.' అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.

రాష్ట్రం సాధించుకున్నాక ఉపాధ్యాయులకు గౌరవం దక్కుతుందని అనున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఉపాధ్యాయులకు గౌరవం లేదన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఏవిధంగా అవమానించిందో అందరూ చూశారని ఆవేదన చెందారు. విద్యాశాఖకు బడ్జెట్​లో రూ.21 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఉపాధ్యాయులకు చెప్పారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నారు. 10 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు.

అందుకే విద్యావ్యవస్థలో ఎక్కడో లోపం ఉందని, ప్రభుత్వం నుంచి ఉన్న లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. పదేళ్లుగా టీచర్లకు ఏనాడు ఒకటో తేదీన జీతాలు పడలేదని ధ్వజమెత్తారు. యజమాని మీద విశ్వాసం ఉన్నప్పుడే ఉద్యోగి నిజాయితీగా పని చేస్తాడని అన్నారు. గత యజమాని కేసీఆర్​పై ఉపాధ్యాయులకు ఎప్పుడూ విశ్వాసం లేదని విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడానికి ఎవరైనా వస్తే వెంటనే స్పందించానని తెలిపారు.

"టీచర్లు తేనెటీగల్లా వారి పని వారు చూసుకుంటారు. ఎవరైనా ముడితే కలిసికట్టుగా దాడి చేస్తారు. టీచర్ల సమస్యలను పరిష్కరించాడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 30 వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతులు ఇచ్చాము. మంత్రులు, అధికారులు టీచర్లకు అందుబాటులో ఉండాలని చెప్పాను. ప్రతినెల ఒకటో తేదీన మీ ఖాతాలో జీతం పడేలా చూసే బాధ్యత నాది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు, ఏమీ ఆశించలేదు. తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో లేదు మీ చేతుల్లో ఉంది. అమెరికాలో చదివానని అసెంబ్లీలో ఒక వ్యక్తి అన్నారు. నువ్వు ఎక్కడ చదువుకున్నావని నన్ను ఆ వ్యక్తి అడిగారు. నేను ప్రభుత్వ పాఠాశాలలో చదివానని గర్వంగా చెప్తున్నాను. ప్రభుత్వ పాఠాశాలలో చదివి సీఎం స్థాయికి ఎదిగాను. ప్రభుత్వ పాఠశాలలో 2 లక్షల ఎడ్మిషన్లు తగ్గాయి."- రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

30 వేల ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ : రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠశాలన్నింటికీ ఉచిత విద్యుత్​ అందిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. టీచర్ల జీతం నుంచి పాఠశాలలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఉపాధ్యాయులే తమ ప్రభుత్వానికి బ్రాండ్​ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఏది కావాలన్నా ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టంగా చెప్పారు. పేదలకు విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులదని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతుల పండగ - 18,942 మంది టీచర్లకు లబ్ధి - Teachers Promotion in Telangana

తెలంగాణ ఉపాధ్యాయులకు మరోసారి గుడ్‌న్యూస్‌ - త్వరలోనే మరింత మందికి ప్రమోషన్స్ - Tg govt to promote another 1500

ABOUT THE AUTHOR

...view details