తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలంతా ఎక్కడున్నా రేషన్ కార్డు తీసుకోండి - త్వరలోనే సన్నబియ్యం : సీఎం రేవంత్ రెడ్డి - CM LAUNCHED FOUR WELFARE SCHEMES

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - నారాయణపేట కోస్గి మండలం చంద్రవంచలో కార్యక్రమం

CM Revanth Launched Four Welfare Schemes
CM Revanth Launched Four Welfare Schemes (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 2:56 PM IST

Updated : Jan 26, 2025, 5:10 PM IST

CM Revanth Launched Four Welfare Schemes :తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన రూ.11.80 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. 734 మందికి రైతు భరోసా చెక్కులను రేవంత్ పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

ఇవాళ రైతుభరోసా డబ్బులు జమ కావు : గణతంత్ర దినోత్సవం రోజున 4 సంక్షేమ పథకాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. సాగు ఖర్చులు పెరిగాయని రైతు భరోసా నిధులు పెంచామన్న రేవంత్ రెడ్డి ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ఇవాళ ఆదివారం కావడంతో రైతు భరోసా డబ్బులు జమకావన్న ఆయన, అర్ధరాత్రి 12 దాటగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని వివరించారు. భూమి లేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారని, వారి కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తీసుకువచ్చామని రేవంత్ వివరించారు. కూలీ పని చేసే పేదలకు ఆ పథకం కింద రూ.12 వేలు ఇస్తున్నామని తెలిపారు.

దివంగత ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఒక్క సంతకంతో దేశమంతటా రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకే విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. అలా చేసిన రాష్ట్రం మరొకటి లేదని వివరించారు. 25.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు జమ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.

భూమికి, విత్తుకు ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్‌కు మధ్య : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో హామీలు నెరవేర్చామని రేవంత్ రెడ్డి వివరించారు. భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్‌కు మధ్య ఉందని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రైతులకు ఉచిత కరెంట్‌ను మొదట అమలు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని పేర్కొన్నారు. దేశమంతటా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్‌ సర్కారేనన్నారు.

రేషన్‌ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్న బియ్యం : గత దశాబ్ధ కాలంలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు రాలేదన్న రేవంత్ రెడ్డి, పదేళ్ల కాలంలో గ్రామాల్లో ఎవరికైనా రెండు పడక గదుల ఇల్లు వచ్చిందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలు ఇంటిని నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా వివరించారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్‌కార్డులు ఇవ్వలేదని రేవంత్ మండిపడ్డారు. రేషన్‌కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. పేదలంతా ఎక్కడ ఉన్నా రేషన్ కార్డు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తోంది : గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించామన్న ఆయన, గ్రామాలకు అధికారులను ఇళ్లకు పంపిస్తున్నామని వివరించారు. గతంలో ఏదైనా కావాలంటే ఎవరైనా ఫామ్‌హౌజ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లుగా వివరించారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులను తీసుకుంటుందని ఆయన వివరించారు.

ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మాట ఇస్తే ఎప్పటికీ వెనక్కి తగ్గదని పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పారని, ఇచ్చారని వివరించారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదని రేవంత్ వివర్శించారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిందని మండిపడ్డారు. కాళేశ్వరం కూలిపోయినా ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగిందని వివరించారు.

ఆ భూములను రైతుభరోసా నుంచి మినహాయించాలి - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

'రైతు భరోసా' డబ్బులు ఈరోజు రావు - ఖాతాల్లోకి నగదు బదిలీ ఎప్పుడంటే?

Last Updated : Jan 26, 2025, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details