ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనకాపల్లి జిల్లాలో మరో 'ఫార్మా' ప్రమాదం - నలుగురు కార్మికులకు గాయాలు - Parawada Pharma City Incident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 9:20 AM IST

Updated : Aug 23, 2024, 1:01 PM IST

Parawada Pharma City Incident: అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి ఘటన జరిగింది. నలుగురు కార్మికులకు గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే వెళ్లాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.

Parawada Pharma City Incident
Parawada Pharma City Incident (ETV Bharat)

Parawada Pharma City Incident: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి ఘటన జరిగింది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులు ఝార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు.

ఛార్జింగ్‌ చేస్తుండగా ప్రమాదం:6 కిలోలీటర్ల రియాక్టర్‌లో కెమికల్‌ నింపి ఛార్జింగ్‌ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్‌హోల్‌ నుంచి రసాయనం ఉప్పొంగి పైకప్పుకు తగిలి కార్మికులపై పడింది. దీంతో గాయపడిన కార్మికులను హుటాహుటిన విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రికి తరలించారు. జార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్‌, కోహర్‌, రోసకు గాయాలు అయ్యాయి. వీరితో పాటు విజయనగరానికి చెందిన కెమిస్ట్‌ సూర్యనారాయణ గాయపడ్డారు.

స్పందించిన సీఎం చంద్రబాబు:ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే వెళ్లాలని ఆదేశించిన సీఎం, మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.

బాధితులకు పరామర్శ: విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ సి.ఎం.రమేష్‌, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పరామర్శించారు. అదే విధంగా ప్రమాద బాధితులను మంత్రి అనిత పరామర్శించారు. రసాయనాలు కలిపే సమయంలో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందని తెలిపారు. నలుగురు కార్మికులకు గాయాలయ్యాయన్న హోంమంత్రి, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామన్నారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యాజమాన్యాలు నిర్లక్ష్యంతోనే పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించాలన్న అనిత, త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామన్నారు. పరిశ్రమల భద్రతపై కమీటి వేసి, పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని, ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అచ్యుతాపురం ఫార్మా ఘటన - ప్రమాదం వెనుక అధికారుల నిర్లక్ష్యం! - Atchutapuram SEZ Incident

Last Updated : Aug 23, 2024, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details