Chillapeta Pond Pollution: చెరువు కాలుష్యం, ఆక్రమణలపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ చిల్లపేట చెరువు చెత్తాచెదరంతో కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో వలస పక్షుల రాకకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం జియోలాజికల్ సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డితో కలిసి రాజేంద్ర సింగ్ చెరువుని పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికులు చెరువు ఆక్రమణలు కాలుష్యంపై గళమెత్తారు. తగరపువలస, భీమునిపట్నం రహదారిలో ఉన్న చిల్లపేట చెరువు కాలక్రమేణా విస్తీర్ణం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రకాల వలస పక్షులకు ఆవాసంగా ఉన్న చిల్లపేట చెరువు చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. రోజురోజుకీ చెరువులోకి ఆక్రమణలు పెరుగుతున్నాయన్నారు.
రహదారికి ఆనుకొని ఉన్న చెరువును కాపాడేందుకు అధికారులు సైతం ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలన్నారు. ఆక్రమణదారులపై ఉక్కు పాదం మోపాలన్నారు. చెరువును పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు తాగునీటి కొరత లేకుండా చేయొచ్చన్నారు.