ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చెరువు కాలుష్యం, ఆక్రమణలపై వాటర్ మ్యాన్ ఆఫ్‌ ఇండియా ఆవేదన - chillapeta pond pollution

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 11:57 AM IST

Chillapeta Pond Pollution: విశాఖ జిల్లా భీమునిపట్నం రహదారిలో ఉన్న చిల్లపేట చెరువు కాలుష్యం, ఆక్రమణలపై వాటర్‌ మాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. చిల్లపేట చెరువును జియోలాజికల్ సైంటిస్ట్‌ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. చెరువు చెత్తాచెదారంతో కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి, వలస పక్షులకు అడ్డంకిగా మారిందన్నారు.

Chillapeta Pond Pollution
Chillapeta Pond Pollution (ETV Bharat)

Chillapeta Pond Pollution: చెరువు కాలుష్యం, ఆక్రమణలపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ చిల్లపేట చెరువు చెత్తాచెదరంతో కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో వలస పక్షుల రాకకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం జియోలాజికల్ సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డితో కలిసి రాజేంద్ర సింగ్ చెరువుని పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానికులు చెరువు ఆక్రమణలు కాలుష్యంపై గళమెత్తారు. తగరపువలస, భీమునిపట్నం రహదారిలో ఉన్న చిల్లపేట చెరువు కాలక్రమేణా విస్తీర్ణం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రకాల వలస పక్షులకు ఆవాసంగా ఉన్న చిల్లపేట చెరువు చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. రోజురోజుకీ చెరువులోకి ఆక్రమణలు పెరుగుతున్నాయన్నారు.

రహదారికి ఆనుకొని ఉన్న చెరువును కాపాడేందుకు అధికారులు సైతం ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలన్నారు. ఆక్రమణదారులపై ఉక్కు పాదం మోపాలన్నారు. చెరువును పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు తాగునీటి కొరత లేకుండా చేయొచ్చన్నారు.

మానవాళికి శాపంగా భూతాపం- మన కర్తవ్యమేంటి? ఏం చేయాలి? - World Environment Day 2024

Environmental Activist visited Bheemili Red Mud Dunes :పర్యావరణ ఉద్యమ కారుడు రాజేంద్రసింగ్ గురువారం భీమిలి ఎర్రమట్టి దిబ్బలను సందర్శించారు. భౌగోళిక వారసత్వ సంపదగా దీనిని పరిరక్షించాలని కోరారు. ఎర్ర మట్టిదిబ్బలు పర్యావరణ సహజ సంపద అని, వీటిపై భూగర్భ నిపుణులు అనేక పరిశోధన చేయాల్సి ఉందని, వాటిని కాపాడుకోవాలని అన్నారు.

ఎర్ర మట్టి దిబ్బలు సముద్ర నీరు చొరబడకుండా కాపాడుతోందని, వాటిని కాపాడాలని కోరారు. విశాఖ నగర అభివృద్ధిలో ఇలాంటి పర్యావరణ విలువైన ప్రదేశాలకు నష్టం జరుగుతోందని ఆవేదన చెందారు. వీటితో పాటే గురువారం భీమిలిలో చిల్లపేట చెరువును సైతం రాజేంద్ర సింగ్, జనసేన పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, పీతల మూర్తి యాదవ్, ఆచార్య రాజశేఖర్ రెడ్డిలు సందర్శించారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటే మనమెంతో లబ్ది పొందుతామని, ఈ విధమైన అమూల్య సంపదను మనం చేతులారా నాశనం చేసుకోవద్దని కోరారు.

'ఎర్రమట్టి దిబ్బలు భౌగోళిక వారసత్వ సంపద- వాటిని కాపాడుకోవాలి' - Bheemili red mud dunes

ABOUT THE AUTHOR

...view details