Central Serious Letter to AP DGP About Security Failures: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల తీరును గర్హిస్తూ డీజీపీకి ఘాటు లేఖ పంపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో ఈనెల ఎనిమిదో తేదీన రోడ్ షో నిర్వహించారు. ప్రధానితో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మహాకూటమి అభ్యర్ధులు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. బందరు రోడ్డుపై నిర్వహించిన ఈ రోడ్డుషోకు అశేషంగా ప్రజలు తరలివచ్చారు.
అయితే ఈ సందర్భంగా ప్రధాని భద్రతా ప్రోటోకాల్ ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా స్పందించింది. భద్రతా వైఫల్యం చోటు చేసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి లేఖ పంపింది. ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభమైన తర్వాత, చివరిలోనూ డ్రోన్స్ గాలిలో ఎగురవేశారని, ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యంగా కేంద్రం ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ ముందుగానే ప్రధాని రోడ్ షో ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించింది. కానీ రాష్ట్ర పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోయారని ఆక్షేపించింది. ప్రధాని రోడ్ షోకు 45 నిమిషాల ముందు డ్రోన్లను గుర్తించిన ఎస్పీజీ, ఒక డ్రోన్ కదలికలను జామర్ల ద్వారా నిలిపివేసిందని, వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది. ఆ తర్వాత కూడా డ్రోన్స్ ఎగురవేశారని, ఎస్పీజీ ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర హోంశాఖ ఇప్పుడు భద్రతా వైఫల్యంగా తేల్చుతూ, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీపీకి లేఖ చేరింది.