Businessman Kidnapping And Murder Case :కొనుగోలు చేసిన సరుకుకు సొమ్ము చెల్లిస్తామని వ్యాపారిని రప్పించారు. అతడినే బంధించి భారీ ఎత్తున డబ్బు కాజేశారు. విషయం బయటపడితే పోలీస్ కేసు తప్పదనే ఉద్దేశంతో వ్యాపారిని హత్య చేశారు. సికింద్రాబాద్ విక్రమ్పురీ కాలనీకి చెందిన వ్యాపారి బొల్లు రమేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సయ్యద్ సజ్జాద్ అహ్మద్ ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరిలించారు. నిందితుడికి సహకరించిన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వ్యాపారి హత్య కేసు :సికింద్రాబాద్ కార్ఖానా విక్రమ్పురీ కాలనీకి చెందిన వ్యాపారి బొల్లు రమేశ్ రెండు రాష్ట్రాల్లో పాన్ మసాలా దుకాణాలకు సరుకు సరఫరా చేస్తుంటారు.పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటారు. పాన్ మసాలా ప్యాకెట్లను కొనుగోలు చేసి దుకాణాలకు విక్రయించే చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ సజ్జాద్ అహ్మద్ఖాన్ ముఠా కొద్ది రోజుల క్రితం రమేశ్ను సంప్రదించారు. అతడి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన పాన్ మసాలా కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన నగదు చెల్లింపులపై నిందితులు రేపూమాపంటూ వాయిదా వేస్తూ వచ్చారు.
నగదు విషయంపై ఇద్దరి మధ్య గొడవ :ఈ నెల 18 ఉదయం డబ్బు తీసుకునేందుకు కాచిగూడ రప్పించగా, నగదు విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో రమేశ్ ఒంటరిగా ఉన్నాడని అతడిని బెదిరించి డబ్బు గుంజేందుకు సిద్ధమయ్యారు. కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. చంపుతారని భయపడిన వ్యాపారి, స్నేహితుడి ద్వారా ఆ నగదును బదిలీ చేయించాడు. డబ్బు తీసుకున్నాక వదిలేయమని ప్రాధేయపడ్డాడు. ప్రాణాలతో వదిలితే డబ్బు కాజేసిన విషయం బయటపడుతుందని భావించిన నిందితులు వ్యాపారి కాళ్లు, చేతులు కట్టి కారులో బంధించారు.