తెలంగాణ

telangana

'రుణమాఫీ హామీపై రేవంత్ మాట తప్పారు - రాజీనామా ఎవరు చేయాలో త్వరలోనే తెలుస్తుంది' - Harish Rao TWEET on cm Revanth

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 7:55 PM IST

Updated : Aug 15, 2024, 10:02 PM IST

BRS MLA Harish Rao Fires On CM Revanth Reddy : రుణమాఫీ హామీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆగస్టు 15 వరకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికల్లో ఊదరగొట్టి, ఇప్పటికే రూ.9 వేల కోట్లు కోతపెట్టారని ఆరోపించారు. మాట తప్పడమే తన నైజం అనే రీతిలో తన నిజ స్వరూపాన్ని రేవంత్‌ బట్టబయలు చేసుకున్నారని దుయ్యబట్టారు. దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలో తెలుస్తుందని హెచ్చరించారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

BRS MLA Harish Rao Fires On CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారని మాజీమంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ హామీపై మాట తప్పారని, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేనన్న విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరన్న ఆయన అబద్దం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని వ్యాఖ్యానించారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా నిస్సిగ్గుగా బీఆర్ఎస్​పై, తనపై అవాకులు చెవాకులు పేలారని హరీశ్ రావు మండిపడ్డారు.

రుణమాఫీ హామీపై మాట తప్పారు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ. 40వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తానన్న రేవంత్ రెడ్డి అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు రూ.31వేల కోట్లు మాఫీ చేస్తానని రూ. 9వేల కోట్లు కోతపెట్టారని విమర్శించారు.

BRS MLA Harish Rao Comments : సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే లక్షణం మోసమే విధానం మాట తప్పడమే నైజం అనే విధంగా తన నిజస్వరూపాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ బట్టబయలు చేసుకున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తాము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు రూ.17వేల కోట్లు అయ్యిందని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? రూ. 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంతోనే కాంగ్రెస్ చేసిన రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతోందని వ్యాఖ్యానించారు. దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలని అడిగారు.

దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పారు :తెలంగాణ నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్​ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవని మాజీమంత్రి అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డికి ఆ సంస్కారం లేదని ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో రేవంత్ చేసిన పాపఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందోనని తాను ఆందోళనకు గురవుతున్నట్లు హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పు, దైవద్రోహానికి తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నట్లు తెలిపారు. రేవంత్ ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పారో ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో తాను స్వయంగా వెళ్లనున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తానని హరీశ్ రావు తెలిపారు.

కష్టం కేసీఆర్‌దైతే బటన్‌ నొక్కేది మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు : జగదీశ్ రెడ్డి - BRS Jagadish Reddy On Sitarama

సమస్యల వలయంలో గురుకులాలు - సత్వరమే సర్కార్​ స్పందించాలని హరీశ్​రావు డిమాండ్​

Last Updated : Aug 15, 2024, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details