ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - ప్రజలు తీవ్ర అవస్థలు

ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో వరద ఉద్ధృతికి నిలిచిన రాకపోకలు - వాహనదారుల ఇబ్బందులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

AP_Rains
AP Rains (ETV Bharat)

AP Rains: వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు కొన్నిచోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షపు నీరు రోడ్లపై నుంచి ప్రవహించడంతో ప్రధాన ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటి ప్రవాహ ఉద్ధృతికి అనేక చోట్ల కల్వర్టులు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మార్కాపురం మండలం భూపతిపల్లె గ్రామం వద్ద వంతెనపై నుంచి గుండ్లకమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తర్లుపాడు మండలం సీతానాగులవరం వద్ద కొండవాగు పొంగడంతో మార్కాపురం- తర్లుపాడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి వద్ద రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో సుంకేసుల, గుండంచెర్ల, కలనూతల గ్రామాల ప్రజలు మార్కాపురం వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. మరోవైపు పొలాల్లోకి భారీగా నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భయాందోళనకు గురవుతున్న ప్రజలు: కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌ సమీపంలో మూడు రోజులుగా సముద్రం ముందుకు వస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడ్డున ఉన్న దుకాణాలు, చిరు వ్యాపారాలు నిర్వహించుకునే ప్రదేశాల వరకు నీరు వచ్చేయడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు.

వాయుగుండం ధాటికి వాగులు, వంకలు పోటెత్తడంతో కడప జిల్లా మీదుగా పెన్నా నది ఉరకలు వేస్తోంది. పెన్నా ఉపనదులైన పాపాగ్ని, కుందూ నదుల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో ఆదినిమ్మాయపల్లె వద్ద అంతకంతకు నీటి ప్రభావం పెరుగుతోంది. మరోవైపు కడపలో కురిసిన వానలకు శివారు ప్రాంతంలోని పాలకొండ జలపాతం కొత్త కళను సంతరించుకుంది. జలపాతం అందాలు వీక్షించేందుకు నగరవాసులు ఆసక్తి కనబరిచారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలో గార్గేయ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతోన్న వరద: నీటి ప్రవాహానికి మూడు చోట్ల కల్వర్టులు కొట్టుకుపోవడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రంలో పశువులను మేపేందుకు వెళ్లి తిరిగివస్తున్న సమయంలో పిడుగు పడటంతో జయరాం అనే రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఏపీతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమేపీ వరద పెరుగుతోంది. దీంతో అధికారులు డ్యాం ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

తీరం దాటి దూసుకొచ్చిన సముద్ర జలాలు - "ప్రమాదానికి సంకేతం" - ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు

"ఇదెక్కడి వాతావరణం" రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ - ఎటు చూసినా ఎండే

ABOUT THE AUTHOR

...view details