Farmer Pulls 101 Sacks of Sorghum with a Cart :పూర్వం రోజుల్లో ఎడ్ల బండ్లే ప్రధాన రవాణా సాధనంగా ఉండేవి. ఎక్కడికి వెళ్లాలన్నా ఎంత దూరమైనా ఎడ్ల బండి మీదే ప్రయాణం సాగించేవారు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో రకాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, నేటికీ చాలా మంది రైతులు పల్లెల్లో తమ వడ్ల బస్తాలు ఇంటికి చేర్చడానికి, అలాగే ఎరువుల బస్తాలు పొలానికి తరలించడానికి ఎడ్ల బండ్లనే ఉపయోగిస్తున్నారు.
సాధారణంగా పంట చేతికి వచ్చాక రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా వడ్లు, జొన్న బస్తాలు, పత్తి సంచులను మార్కెట్కు లేదా ఇంటికి తరలిస్తుంటారు. ఒక ఎడ్ల బండి మీద దాదాపు 10 నుంచి 15 వరకు బస్తాలు మాత్రమే పడుతుంటాయి. పొలం వద్ద ఒక వంద బస్తాలు ఉన్నాయి అనుకుంటే, వాటిని తరలించడానికి ఒక ఎడ్ల బండి మీద 5 లేదా 6 సార్లు చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. కానీ, అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు తన వద్ద ఉన్న 101 జొన్న బస్తాలను తరలించడానికి ఒక చక్కటి ఉపాయం చేశారు. ఈ ఉపాయం ద్వారా ఒకేసారి అన్ని బస్తాలను ఇంటికి తరలించారు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే వ్యవసాయంలో ఎద్దుల పాత్ర ఎంతో ఉందని, వాటిని పరిరక్షించుకోవాలన్నదే తమ ఉద్దేశమని రైతు పూజారి శీన తెలిపాడు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగిలో పూజారి శీన జొన్నలు పండించాడు. ఈయన 101 జొన్న బస్తాలను ఐదు ఎడ్లబండ్లలో వేసి బండెనక బండి కట్టి ఒక వైపు ఎద్దును కట్టి, మరోవైపు మనుషులతో లాగించారు. ఎద్దుల పెంపకంపై ఆయనకు ఉన్న ఉత్సాహం, ప్రేమతో ఎద్దుతో మూడు కిలోమీటర్ల మేర లాగించారు.