ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పర్యాటక హబ్‌గా అమరావతి - రూ. 500 కోట్లతో ప్రణాళికలు - Amaravati Tourism Development

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 9:12 AM IST

Amaravati Tourism Development: రాజధాని అమరావతిని పర్యాటకానికి పెట్టనికోటలా నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాజధాని ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, వినోద, సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఇందుకోసం 500 కోట్ల రూపాయల విలువైన పనులతో ప్రణాళికలు సిద్ధం చేయనుంది.

Amaravati Tourism Development
Amaravati Tourism Development (ETV Bharat)

Amaravati Tourism Development: రాజధాని అమరావతిని పర్యాటక రంగంలోనూ మేరు నగరంలా నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాజధాని ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ. 500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయనుంది. మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని పర్యాటకశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఆదేశించారు.

మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించబోతోంది. ప్రసాద్, స్వదేశ్‌ దర్శన్‌ పథకాల తరహాలో ఈ కార్యక్రమం ఉండబోతుందన్న సమాచారంతో అమరావతిని పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13న పర్యాటక శాఖపై సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ ప్రస్తావన వచ్చింది. డీపీఆర్‌ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ వెలుగు రేఖ, రాజధాని అమరావతి మీ ఊరుకు ఎంత దూరమంటే? - AMARAVATI OUTER RING ROAD

ఏమేం చేయాలనుకుంటున్నారు?:

  • కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్ని వినోద, విజ్ఞాన, సాహస, సాంస్కృతిక, అధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా తీర్చిదిద్దనున్నారు.
  • కనకదుర్గమ్మ ఆలయం నుంచి భవానీ ఐలాండ్ వరకు రోప్‌ వే (తీగ వంతెన) ఏర్పాటు చేయనున్నారు. భవానీ ద్వీపంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం కింద సందర్శకులకు అనేక అదనపు వసతులు కల్పించే అవకాశాలున్నాయి. ద్వీపంలో రెండు రోజులపాటు కుటుంబసభ్యులతో ఆహ్లాదభరిత వాతావరణంలో గడిపేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.
  • పర్యాటకుల కోసం కృష్ణా నదిలో రాత్రి పూట బోట్లు తిప్పేలా ప్రతిపాదిస్తున్నారు. బోటులోనే వసతి, భోజనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఫ్లోటింగ్‌ రెస్టారెంట్ల అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.
  • రాజధాని నుంచి ప్రఖ్యాత కొండపల్లి కోట, ఉండవల్లిలోని అనంత పద్మనాభ స్వామి గుహలు, మంగళగిరి పానకాలస్వామి ఆలయం, అమరావతి ఆలయం తదితర ప్రాంతాలకు మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. కొండపల్లి బొమ్మల తయారీకి మరింత ప్రాచుర్యం కల్పించి పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తారు.
  • రాజధాని అమరావతిలో ప్రఖ్యాత కంపెనీల ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పర్యాటకుల కోసం హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు పిలవనున్నారు. బెర్మ్‌ పార్కును మరింత అభివృద్ధి చేసి, అదనపు సౌకర్యాలు కల్పించనున్నారు.

అమరావతి మహానగరికి ఓఆర్​ఆర్​ హారం- రాష్ట్రంలో ఇక భూములు బంగారం - Amravati Ring Road Project

ఆహ్లాదకర వాతావరణంలో విహరించేందుకు: రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చేవారు ఒకటి, రెండు రోజులు ఇక్కడే ఉండి ప్రముఖ ఆలయాలు, ప్రసిద్ధ ప్రాంతాలు సందర్శించేలా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో విహరించేందుకు అనువైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. కన్సల్టెన్సీ ఎంపిక పూర్తి చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు.

అమరావతి నిర్మాణం స్పీడప్​ - ప్రతి సెంటు భూమి తీసుకోవాలని నిర్ణయం - Capital Amaravati Construction

ABOUT THE AUTHOR

...view details