Transport Department Awareness Program : వాహనదారులు కచ్చితంగా ముందు జాగ్రత్తతో హెల్మెట్, సీటుబెల్ట్ ధరించి నడపాలని హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. ప్రాణం పోతే మళ్లీ రాదని ఈ సందర్బంగా పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా హిందూపురం రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి బుల్లెట్ బైక్ నడిపారు.
‘‘బైక్ నడిపే వాళ్లు ముందు జాగ్రత్తగా హెల్మెట్ను కచ్చితంగా ధరించాలి. కొన్నిసార్లు తప్పు మనవైపు జరగకపోవచ్చు, కొన్నిసార్లు మనది కూడా తప్పు కావచ్చు. ప్రమాదం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా బైక్ నడుపుకుంటూ వెళ్లాలి. అలాగే, కారు నడిపేవాళ్లు సీటు బెల్ట్ పెట్టుకోవడం చాలా ముఖ్యమైన అంశం. ఒక పౌరుడిగా మీపై కూడా బాధ్యత ఉంటుంది. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించకపోతే, శిక్షలు కఠినంగా ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. ఈ మధ్య ఇతరులను చూసి వారిలా చేయడం ఎక్కువైపోయింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడానికి, ఇతరులకు చూపించుకోవడానికి బైక్స్పై స్టంట్స్ చేస్తున్నారు. జీవితమంటే ఇది కాదు. జీవితం చాలా విలువతో కూడుకున్నది. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని అరికట్టడానికి ఎక్కడికక్కడ సీసీటీవీలను ఏర్పాటు చేస్తోంది. నిబంధనలు అతిక్రమించి వాహనాలను నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటారు. దయచేసి నియమ నిబంధనలు పాటించి, మీ ప్రాణాలు కాపాడుకోండి’’ -నందమూరి బాలకృష్ణ, హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు