BCCI Earnings From IPL : క్రీడాభిమానులను ఉత్తేజపరిచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు భారత క్రికెట్ బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2022 సీజన్తో పోలిస్తే 2023 ఎడిషన్ వల్లనే 'మిగులు సంపాదన'లో 116 శాతం పెరుగుదల కనిపించినట్లు తాజాగా వెలువడిన పలు నివేదికల్లో స్పష్టమవుతోంది. 2022 ఐపీఎల్లో రూ.2,367 కోట్లు ఉండగా, ఆ తర్వాతి ఏడాదికి అది కాస్త రూ.5,120 కోట్లకు చేరింది. అలాగే ఐపీఎల్ 2023 ఎడిషన్ ఆదాయం రూ.11,769 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతకుముందిటి ఏడాదితో పోలిస్తే ఇప్పుడే 78 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అయితే అటు ఖర్చులు కూడా 66 శాతం పెరిగి రూ.6,648 కోట్లకు చేరాయని తెలుస్తోంది.
ముఖ్యంగా ఐపీఎల్ టెలికాస్టింగ్ రైట్స్, స్పాన్సర్షిప్స్ వల్లే భారీగా మిగులు కనిపించినట్లు క్రికెట్ వర్గాల మాట. 2023-27 సీజన్ కోసం మీడియా హక్కుల ద్వారానే బీసీసీఐకి సుమారు రూ.48,390 కోట్లు వచ్చాయి. ఇందులో ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు (స్టార్ స్పోర్ట్స్) ద్వారా రూ.23,575 కోట్లు, అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ (జియో సినిమా)తో రూ. 23,758 కోట్లు దక్కించుకుంది. మరోవైపు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులను ప్రముఖ టాటా సన్స్ రూ. 2,500 కోట్లకు తీసుకుంది.