Shri Choudeshwari Devi Mahotsavam : అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి మహోత్సవాలు తొగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆదిపరాశక్తి, ఆదిపరంజ్యోతి, మహిషాసుర మర్దిని, భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చేటి చల్లని తల్లిగా వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల ఉత్సవాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. ఏటా పుష్యమాసంలో అమ్మవారి పంచమ జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పట్టణంలో మూడు రోజులపాటు జరిగే శ్రీ చౌడేశ్వరిదేవి పంచమ జ్యోతుల మహోత్సవానికి ఉమ్మడి అనంతపురం జిల్లా, కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, చిత్రదుర్గం, విజయనగరం, తుమకూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూర్ణకుంభాలు, పంచమ జ్యోతుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు దారి పొడవునా తడి దుస్తులతో జ్యోతుల ఎదుట బారులు తీరారు. భక్తులు, మహిళలు, చిన్నపిల్లలు శస్త్రాలు వేయించుకొని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.
జమ్మలమడుగులో ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి
కొండలో గుర్తించి: విజయనగర సామంత రాజు అయిన భూపతి రాయల కాలంలో రాయదుర్గం కొండపై చౌడేశ్వరీ దేవి వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. కులదైవమైన అమ్మవారిని కొండలో గుర్తించిన తోగట వీర క్షత్రియులు 1956 సంవత్సరంలో రాయదుర్గం పట్టణంలోని నేసేపేటలో ప్రతిష్ఠించారు. ఏటా పుష్య మాసంలో మహిళలు, యువతులతో పెద్ద ఎత్తున కలశాలతో ఊరేగింపులు, పూజలు నిర్వహిస్తారు. 1992 నుంచి శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం నిర్వహిస్తున్నారు. శ్రీ చౌడేశ్వరి దేవి పంచమి జ్యోతుల మహోత్సవం రాయదుర్గం పట్టణంలోని పురవీధులలో డప్పులు, భజనలతో భక్తులు అమ్మవారి శోభాయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తోగట వీర క్షత్రియ సంఘం నాయకులు, భక్తులు, శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ సభ్యులు, వేలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్న సంతర్పణ కార్యక్రమాలు చేపట్టారు.