తెలంగాణ

telangana

పుత్ర సంతాన భాగ్యం కలిగించే రామలక్ష్మణ ద్వాదశి- వ్రతం చేయాల్సిన విధానం ఇదే! - Rama Lakshmana Dwadashi Puja

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 10:49 PM IST

Rama Lakshmana Dwadashi Vratham : వ్రతాలూ, నోములు, పూజలు హిందూ సంప్రదాయంలో ఒక భాగం. ఐశ్వర్యం కోసం, సంతానం కోసం, ఆరోగ్యం కోసం ఇలా రకరకాల సమస్యలకు పరిహారంగా చేయాల్సిన పూజలు, నోములు గురించి శాస్త్రాలలో వివరించారు. ముఖ్యంగా పుత్ర సంతానం కోరుకునే వారు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు చేయాల్సిన పూజ గురించి తెలుసుకుందాం.

Rama Lakshmana Dwadashi Puja
Rama Lakshmana Dwadashi Puja (ETV Bharat)

Rama Lakshmana Dwadashi Vratham : జ్యేష్ఠ మాసంలో పవిత్రమైన నిర్జల ఏకాదశి పక్కరోజు వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశిగా జరుపుకుంటాం. వరాహ పురాణం ప్రకారం ప్రతినెలా శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశేషమైనదే! రామలక్ష్మణ ద్వాదశిని చంపక ద్వాదశి అని కూడా అంటారు.

రామలక్ష్మణ ద్వాదశి వెనుక పురాణ గాథ
పుత్రసంతానం కోసం పరితపిస్తున్న దశరధ మహారాజుకు వశిష్ఠుడు రామలక్ష్మణ ద్వాదశి వ్రత విధానాన్ని వివరించాడు. దశరధ మహారాజు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి రోజు ఈ వ్రతాన్ని ఆచరించగా అక్కడ నుంచి సరిగ్గా 10 నెలల తర్వాత వచ్చిన చైత్ర మాసంలో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు దశరధ మహారాజుకు జన్మించారు. అందుకే పుత్ర సంతానం కోరుకునే వారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని శాస్త్రం చెబుతోంది.

వ్రత విధానం
పుత్ర సంతానం కోరుకునేవారు రామలక్ష్మణ ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై రామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించి, శాస్త్రోకంగా కలశ స్థాపన చేయాలి. అనంతరం రామలక్ష్మణులకు ఆవాహన, ఆచమనం వంటి 16 రకాల షోడశోపచార పూజలు చేయాలి. రామలక్ష్మణులకు వస్త్ర సమర్పణ చేయాలి. పూజ పూర్తి అయ్యేవరకు ఉపవాసం చేయాలి.

ఈ రోజు ఈ దానాలు చేయాలి
ఈ సందర్భంగా రామలక్ష్మణ ద్వాదశి ముందు నిర్జల ఏకాదశి రోజు ఆర్ధికంగా శక్తి ఉన్నవారు బంగారు రామలక్ష్మణులు విగ్రహాలను పూజించి, రామలక్ష్మణ ద్వాదశి రోజు పూజించిన బంగారు విగ్రహాలను దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్ర వచనం. శక్తికొద్దీ మట్టి ప్రతిమలను కూడా దానం చేయవచ్చు. అంతేకాకుండా ఈ రోజు బ్రాహ్మణులకు గోదానం, భూదానం, వస్త్ర దానం, సువర్ణ దానం వంటి దానాలు కూడా విరివిగా చేస్తే వ్రతఫలం అధికమవుతుంది.

ఒడిషాలో ఇలా!
రామలక్ష్మణ ద్వాదశిని ఒడిషాలో చంపక ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో ఇది చాలా ముఖ్యమైన పండుగ. పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఈ పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. ఉత్కళ బ్రాహ్మణులకు రామలక్ష్మణ ద్వాదశి పవిత్రమైన రోజు. జగన్నాధునికి ఈ రోజు విశేష పూజలు, ప్రత్యేక ప్రసాదాలు తయారు చేస్తారు. ఈ పూజలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు.

రామలక్ష్మణ ద్వాదశి వ్రతఫలం
నియమ నిష్టలతో రామలక్ష్మణ ద్వాదశి వ్రతం ఆచరిస్తే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని శాస్త్రవచనం. సాటిలేని ఈ వ్రతం వల్ల అపారమైన పుణ్యం, పరాక్రమం, కీర్తి గౌరవం, ఐశ్వర్యం, రాజ్యం వంటివి ప్రాప్తిస్తాయి.

గవామయన యాగ ఫలం
రామలక్ష్మణ ద్వాదశి వ్రతం చేసిన వారికి గవామయన యాగ ఫలం దక్కుతుందని అంటారు. గవామయన యాగం అంటే ఒక సంవత్సర కాలం పాటు నిర్విఘ్నంగా యాగం చేసిన ఫలం అని అర్ధం.

చూసినా గొప్ప ఫలం
ఈ వ్రతం చేసిన వారికే కాకుండా చూసినా వారికీ, వ్రతంలో పాలుపంచుకున్న వారు కూడా సకల సంతోషాలు, శ్రేయస్సులతో పాటు విష్ణులోక ప్రాప్తిని పొందుతారు.

ఆదిశంకరుల ఆరాధన
నడిచే దైవంగా పేరుగాంచిన జగద్గురువు ఆది శంకరాచార్యులు రామలక్ష్మణ ద్వాదశి రోజునే అవతార పరిసమాప్తి గావించారంట! అందుకే ఈ ద్వాదశి రోజు ఆదిశంకరుల ధ్యానం వల్ల ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది.

జూన్ 19 వతేదీన రానున్న రామలక్ష్మణ ద్వాదశిని పుత్ర సంతానం కోరుకునే వారు మాత్రమే కాకుండా ఎవరైనా జరుపుకోవచ్చు. శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details