తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

షట్టిల ఏకాదశి వ్రత కథ- చదివినా, విన్నా మోక్షం ఖాయం! - SHATTILA EKADASHI VRAT KATHA

షట్​తిల ఏకాదశి వ్రత కథ మీకోసం

Shattila Ekadashi Vrat Katha
Shattila Ekadashi Vrat Katha (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2025, 5:31 AM IST

Shattila Ekadashi Vrat Katha :ఏ పూజైనా, వ్రతమైనా పూజావిధి పూర్తయ్యాక ఆ వ్రతానికి సంబంధించిన కథను చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటేనే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. ఈ కథనంలో షట్టిల (షట్​తిల) ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం.

షట్​తిల ఏకాదశి వ్రత కథ
చాలా కాలం క్రితం జరిగిన ఘటన. దాదాపుగా ద్వాపర యుగంలో ఈ సంఘటన జరిగినట్లుగా చెబుతారు. ఒక ఊరిలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ఆమె తన సంపదను దానధర్మాలకు వెచ్చించింది. అడిగినవారికి కోరినంత ధనం, ఆభరణాలు ఇలా విలువైన వస్తువులను ఎన్నింటినో దానం చేసిన ఆమెకు ఎందుకో అన్నదానం చేయడం ఇష్టం ఉండేది కాదు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అని చెబుతారు కదా. ఈ విషయమై అందరూ ఆమెకు ఎంతో నచ్చ చెప్పాలని చూసినా ఫలితం లేకపోయింది. ఆమె ఆహారం మినహా ప్రజలు కోరుకునే ఏదైనా దానం చేసేది.

శ్రీకృష్ణుని మాయ
ఇదిలా ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు ఆ శ్రీమంతురాలికి అన్నదానం గొప్పతనాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. కృష్ణుడు బిచ్చగాడి రూపాన్ని ధరించి, శ్రీమంతురాలి వద్దకు వెళ్లి ఆహారం అర్ధించాడు. కానీ ఆ స్త్రీ బిచ్చగాడికి భిక్షలో ఆహారం ఇవ్వడానికి నిరాకరించి అతనిని తరిమికొట్టింది. పట్టువదలని ఆ భిక్షకుడు తిరిగి వచ్చి మళ్లీ ఆహారం కోసం అడుగగా, ఆమె అతని భిక్షా పాత్రలో మట్టిని వేసి అవమానించింది. ఆశ్చర్యకరంగా ఆ భిక్షకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

మట్టిగా మారిన సకల సంపదలు
భిక్షకుని వెళ్లగొట్టి శ్రీమంతురాలు తిరిగి ఇంట్లోకి వెళ్లేసరికి ఆమె ఇంట్లో వండిన ఆహారమంతా మట్టిగా మారడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అంతేకాదు ఆమె తినడం కోసం ఏది కొన్నా అది మట్టిగా మారిపోతుండేది. అంత సంపద ఉన్నప్పటికీ, ఆమె తినడానికి కొన్నవి కొన్నట్లు మట్టిగా మారిపోతుండడం వల్ల ఆమెకు ఆహారం కరువైంది. ఇంట్లో సకల సంపదలు ఉన్నా ఆమె తినడానికి మాత్రం ఏమి ఉండేది కాదు. ఆ విధంగా ఆకలితో శ్రీమంతురాలి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం ప్రారంభించింది.

శ్రీకృష్ణుని శరణు కోరిన శ్రీమంతురాలు
ఆకలితో ప్రాణం పోయే స్థితిలో ఆమె తన ఇష్ట దైవమైన శ్రీకృష్ణుని రక్షించమని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు కలలో కనిపించి, భిక్షకుని పాత్రలో మట్టి వేసి అవమానించినందున, ఆమెకు ఈ గతి పట్టిందని పేదలకు అన్నదానం చేయమని అలాగే షట్​తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆమెకు ఉపదేశించాడు.

అన్నదానంతో తిరిగి వచ్చిన సౌభాగ్యం
శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆ శ్రీమంతురాలు ఆనాటి నుంచి పేదలకు, అన్నార్తులకు అన్నదానం చేయడం వల్ల ఆమె కోల్పోయినదంతా తిరిగి వచ్చింది. అలాగే ఆమె భక్తిశ్రద్ధలతో షట్​తిల ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించి ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి మరణాంతరం మోక్షాన్ని పొందింది.

షట్​తిల ఏకాదశి వ్రత మహాత్యం
ఎవరైతే షట్​తిల ఏకాదశి వ్రతాన్ని భక్తి విశ్వాసాలతో ఆచరిస్తారో వారు తమ జీవితకాలంలో సకల సంపదలు, కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు పొందుతారు. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం, అవసరంలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేసినవారు తమ జీవిత కాలంలో దేనికి లోటు లేకుండా ఉంటారని శాస్త్రవచనం. షట్​తిల ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ కథను చదివినా విన్నా ఏకాదశి వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details