ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్లాన్ ఫెయిల్ - ముంబయి నటి కేసులో అడ్డంగా బుక్కైన వైఎస్సార్సీపీ నేతలు - Mumbai Actress Harassment Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 11:44 AM IST

Mumbai Actress Harassment Case: ముంబయికి చెందిన సినీనటి కేసులో ఏపీ పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల ప్లాన్ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. సినీనటిని అరెస్టు చేసి, ఆమె విషయంలో వ్యవహరించిన తీరుపై కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

Mumbai Actress Harassment Case
Mumbai Actress Harassment Case (ETV Bharat)

YSRCP Leaders and AP Police officers plan Failed: అడ్డగోలుగా కేసు నమోదు చేసి, ముంబయికి చెందిన సినీనటిని అరెస్టు చేసిన వ్యవహారంలో ఏపీ పోలీసులు, నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్న ప్లాన్ బెడిసికొడుతోంది. ఏదో ఒక కేసు పెట్టి ఇరికించాలనే ఆత్రుతలో వారు తప్పటడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో తన 5 ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు బాలీవుడ్‌ నటి ఫోర్జరీ పత్రాన్ని సృష్టించిందని వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ (Kukkala Vidya Sagar) ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఫిర్యాదు ఇచ్చారు.

దీని ఆధారంగానే కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను ముంబయి వెళ్లి అరెస్టు చేశారు. ఆమెకి వ్యతిరేకంగా ఫోర్జరీ కేసులో సాక్ష్యాలు సృష్టించడంలో వైఎస్సార్సీపీకి సన్నిహితుడైన ఓ న్యాయవాది కీలక పాత్ర పోషించారు. పోలీసులకు ఆయనే దిశానిర్దేశం చేసినట్లు తెలిస్తోంది. ‘జగ్గయ్యపేటలో నా ఐదెకరాల పొలాన్ని నటికి అమ్మినట్లు, అందుకు రూ.50 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నట్లు 100 రూపాయల స్టాంపు పత్రంపై ఆమె నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ పత్రాన్ని చూపించి, భూమి అమ్ముతానని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన బోరుకాటి భరత్‌కుమార్‌, మొవ్వ మండలం కోసూరుకు చెందిన చిందా వీర వెంకట నాగేశ్వరరాజుల నుంచి అడ్వాన్సుగా 5 లక్షల రూపాయలు వసూలు చేసింది’ అని కుక్కల విద్యాసాగర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే అడ్వాన్సుగా డబ్బులిచ్చామంటున్న నాగేశ్వరరాజు అనే వ్యక్తి విద్యాసాగర్‌ తండ్రి, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్‌ కుక్కల నాగేశ్వరరావుకి శిష్యుడు. గతంలో తన సొంత డబ్బులతో నాగేశ్వరరాజును కోసూరు సర్పంచిగా ఆయన గెలిపించారు. ఇక బోరుకాటి భరత్‌కుమార్‌ అనే వ్యక్తి నాగేశ్వరరాజు అల్లుడు కావడం గమనార్హం. విద్యాసాగర్‌కు అంత సన్నిహితులను ముంబయికి చెందిన ఆ నటి ఆశ్రయించి, భూమిని అమ్ముతానంటూ చెప్పి ఎలా అడ్వాన్సు తీసుకుందో పోలీసులకే తెలియాలి.

అనేక అనుమానాలు:బాలీవుడ్‌ నటి తయారు చేయించిందని పోలీసులు చెబుతున్న ఫోర్జరీ డాక్యుమెంట్‌ నెంబర్ 80AA714164 ముంబయిలో కొనుగోలు చేసినట్లు ఉంది. ఇందులో రాజేంద్ర, సునీల్‌ అనే ఇద్దరి వ్యక్తులు సాక్షి సంతకాలు చేసినట్లు ఉంది. ఈ పత్రంలో పేర్కొన్న అడ్రస్ ఉన్న ఇంటిని తాను 2020లో కొన్నానని నటి చెప్తోంది. కానీ 2018వ సంవత్సరంలోనే విద్యాసాగర్‌ సంతకంతో నటి తయారుచేసిందంటున్న ఫోర్జరీ డాక్యుమెంట్‌లో, 2020లో కొన్న ఇంటి వివరాలు ఉండటం గమనార్హం. పాత తేదీతో తనను కేసులో ఇరికించేందుకు తప్పుడు పత్రాన్ని సృష్టించారు అని చెప్పడానికి ఇదే ఆధారమని ఆమె చెబుతోంది. తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని మార్చి 28వ తేదీన ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసింది. కౌంటరు దాఖలు చేయాలని కోర్టు ప్రతివాదులకు నోటీసులిచ్చింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం.

గూండాల తరహాలో కిడ్నాప్‌ చేశారు - ఏపీ పోలీసులు వేధించారు: ముంబై నటి - Mumbai Actress Harassment Issue

వైరల్ ఫొటో - హీరోయిన్​తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ - ysrcp kukkala vidya sagar Issue

ABOUT THE AUTHOR

...view details