CM Chandrababu at Independence Day Celebrations: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ పోలీసు బలగాల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని, 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని గుర్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు.
1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న సీఎం, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించామని పేర్కొన్నారు. తమ అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడేతత్వంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు.
120కి పైగా సంక్షేమ పథకాలు: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి వేగంగా ముందుకెళ్లామన్న చంద్రబాబు, దేశంలో ఎవరూ ఊహించని విధంగా సంస్కరణలతో 13.5 శాతం వృద్ధి రేటుతో నిలిచామని గుర్తు చేసుకున్నారు. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమంగా నిలిచామని వెల్లడించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని లేని రాష్ట్రమని బాధగా కూర్చోలేదని, సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నామని పేర్కొన్నారు. దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామని, రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ప్రజల సహకారంతో 34 వేల ఎకరాలు భూసేకరణ చేశామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎప్పుడూ నమ్ముతామని స్పష్టం చేశారు.
పోలవరాన్ని పరుగులు పెట్టించాం: సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం, నాడు ఐదేళ్లలో 68 వేల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్న చంద్రబాబు, ఒక యజ్ఞం మాదిరిగా ప్రాజెక్టును పరుగులు పెట్టించామని వెల్లడించారు. 73 శాతం పనులు పూర్తిచేశామని, తామే కొనసాగి ఉంటే ఈపాటికే పోలవరం పూర్తయ్యేదన్నారు.
ఒక్క ఛాన్స్ పేరుతో విధ్వంసం సృష్టించారు:ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన గత పాలకులు విధ్వంసం సృష్టించారన్న చంద్రబాబు, బాధితులనే నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. నియంత పోకడలు, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారని, ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో వేధించారన్నారు.
తీరని ద్రోహం చేశారు:ప్రజావేదిక ధ్వంసంతో నాటి పాలన సాగించారన్న చంద్రబాబు, నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి లేదని ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. 10 లక్షల కోట్ల అప్పులు, అసమర్థ, అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిధులను దారిమళ్లించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
మా నినాదాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు: ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలన్న తమ నినాదాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్న చంద్రబాబు, తమపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారన్నారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. సుపరిపాలనకు తొలిరోజు నుంచి కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించినట్లయిందని పేర్కొన్నారు.
అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నాం: సింపుల్ గవర్నెన్స్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ అనే నినాదంతో పని చేస్తున్నామన్నారు. ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛా స్వాతంత్య్రం, స్వేచ్ఛను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామన్న సీఎం, వంద రోజుల ప్రణాళిక లక్ష్యంగా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖలను ప్రక్షాళన చేస్తున్నామని, గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజలకు దగ్గరగా పాలన సాగిస్తున్నామని, బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేశామని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో ప్రజల కష్టాలను చూసి మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. మదనపల్లి ఫైల్స్ లాంటి ఘటనల తరవాత అలాంటి పరిస్థితుల ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు.
బొమ్మలకు 700 కోట్లు తగలేశారు: నాడు-నేడు అని మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర అగాధంలోకి నెట్టిందని సీఎం మండిపడ్డారు. తాను బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశానని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయన్నారు. పట్టాదార్ పాస్పుస్తకాలు, సర్వేరాళ్లపై బొమ్మలకు 700 కోట్లు తగలేశారని ధ్వజమెత్తారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుతో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారని, మొదటి కేబినెట్లోనే చర్చించి ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దుచేశామని గుర్తు చేశారు.