AP Cabinet Meeting Chaired by CM Chandrababu:ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ క్రమంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని క్యాబినెట్లో ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి కుదిస్తూ సవరణ చేశారు.
2024- 25 కొత్త క్రీడా పాలసీకి క్యాబినెట్లో ఆమోదం లభించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కొటిక్ గ్రూప్)గా మారుస్తూ క్యాబినెట్ తీర్మానించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి క్యాబినెట్లో తీర్మానం లభించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో విలీనం చేసేందుకు మంత్రి వర్గం ఆమోదించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ క్యాబినెట్లో ప్రతిపాదన చేశారు.