ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో మహమ్మారి - మంకీపాక్స్​తో భారత్‌కు ముప్పు ఎంత? - Monkeypox Outbreak

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 9:51 AM IST

Pratidwani: కొన్నిరోజులుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో మహమ్మారి మంకీపాక్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర స్థితి సైతం ప్రకటించింది. ఆఫ్రికాలో వేగంగా మంకీపాక్స్ వ్యాధి విస్తరిస్తోంది. ఆఫ్రికా వెలుపల కూడా మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన నేపథ్యంలో భారత్‌ సైతం అప్రమత్తమైంది. అసలు ఏంటీ మంకీపాక్స్ వ్యాధి, ఇది ఎక్కడ ఎలా మొదలైంది, దీనికి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా అనే పలు అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Monkeypox Outbreak
Monkeypox Outbreak (ETV Bharat)

Pratidwani: ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికిస్తోంది. మంకీపాక్స్ (Mpox) రూపంలో దేశాలకు దేశాలకే కంటిపై కునుకు లేకుండా చేస్తోంది కొత్త ఉపద్రవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది. అంతర్జాతీయ సమాజమంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆఫ్రికాలో మొదలైన ఈ మహమ్మారి ఐరోపా దేశాలకు సైతం చేరింది. ఇప్పుడు ఈ మంకీపాక్స్‌ (Mpox) భారత్‌ పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు కూడా చేరింది.

లక్షలమంది ప్రాణాలు తీసిన కరోనా మహమ్మారి పీడ పోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఏంటీ మంకీ పాక్స్ కలకలం? ఈ ముసలం ఎక్కడ మొదలైంది? ఆఫ్రికాలో శరవేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్ భారతదేశానికి కూడా పాకే ప్రమాదం ఉందా? అసలు మంకీ పాక్స్ వ్యాధి ఎలా వస్తుంది? ఎలా వ్యాప్తి చెందుతుంది? నివారణ మార్గాలు, వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం. దీనిపై చర్చించేందుకు ప్రజారోగ్య రంగ నిపుణులు డా. బి. రంగారెడ్డి, క్లినికల్ మైక్రోబయాలజీ నిపుణురాలు డా. శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంకీపాక్స్‌ విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం - ఐసోలేషన్​ వార్డులు, నోడల్ ఆసుపత్రులు ఏర్పాటు! - Monkeypox Status In India

మొదట్లో ఎప్పుడు గుర్తించారంటే:ఈ వ్యాధిని 1958లో మొదటగా గుర్తించగా, 1970లో ఓ మనిషికి ఇది సోకింది. తొలుత ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు మంకీపాక్స్​ను నిర్లక్ష్యం చేశాయి. అనంతరం 2022లో భారీస్థాయిలో మంకీపాక్స్‌ వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలు మొదలుపెట్టాయి. గత 60 ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే, గత 2 సంవత్సరాల్లో చేసినవే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఏదోఒక మూల అంటువ్యాధి వచ్చిందని ఇతర దేశాలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని మంకీపాక్స్ వ్యాప్తి చెబుతోంది.

ఆందోళన దేనికి?:మంకీపాక్స్‌లో క్లాడ్‌-1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌) అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో క్లాడ్‌-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండగా, క్లాడ్‌-2 తక్కువ ప్రమాదకరం. క్లాడ్‌-1 కారణంగా న్యూమోనియా, బ్యాక్టిరియల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు సైతం వస్తాయి. మరణాల రేటు కూడా 1 నుంచి 10 శాతం వరకు ఉంది. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు వస్తాయి. క్లాడ్‌-1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాపించం ఆందోళన కలిగిస్తోంది. లైంగిక సంబంధాల కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తుంది.

ఆఫ్రికాలో 18వేలకు చేరిన ఎంపాక్స్ కేసులు- వ్యాపారుల ఆందోళన- దిల్లీలో హైలెవెల్ మీటింగ్​ - Monkeypox Cases

ఎలా వ్యాప్తి చెందుతుంది:నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్‌ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల, రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం వల్ల వైరస్‌ ప్రవేశించవచ్చు.

లక్షణాలేంటి:ఈ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 - 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. జ్వరం, గొంతు ఎండిపోవడం, పొక్కులు, తల నొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఇవి దాదాపు 2 - 4 వారాలపాటు కొనసాగవచ్చు. ఇది వ్యాధి సోకిన వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.

టీకాలు ఉన్నాయా?:ప్రస్తుతం మంకీపాక్స్‌ నివారణకు 2 టీకాలు ఉన్నాయి. వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) స్ట్రాటజిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ అత్యవసర వినియోగానికి లిస్టింగ్‌ చేసింది. అయితే ఈ టీకాలను చాలా ప్రపంచదేశాల్లో ఆయా ఆరోగ్య విభాగాలు అనుమతులు జారీ చేయకపోవడం కొంత సమస్యాత్మకం కానుంది.

పాక్​లో మంకీపాక్స్ కలకలం- స్వీడన్​లో తొలి కేసు- వైరస్ లక్షణాలేంటంటే? - Monkeypox Virus In Pakistan

కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు: మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ సరిహద్దుల దగ్గర నిఘా పెంచాలని, మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్న వారెవరైనా కనిపిస్తే వెంటనే తెలపాలని పేర్కొంది. మంకీపాక్స్‌ వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు వీలుగా దేశరాజధాని దిల్లీలో పలు ఆసుపత్రులను గుర్తించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ నోడల్‌ కేంద్రాలుగా కొన్ని ఆసుపత్రులను గుర్తించాలని సూచించింది. ఇప్పటివరకూ దేశంలో మంకీపాక్స్‌ కేసు ఒక్కటీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఒకవేళ నమోదైనా భారీస్థాయిలో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనన్నారు. దీనిపై మరింత సమాచారం కోసం పైన కనిపించే వీడియోపైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details