BLUE FLAG BEACH IN VISAKHA :పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యాటక రంగంపైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సందర్శనీయ స్థలాలతో పాటు ప్రధానంగా విశాల సముద్ర తీర ప్రాంత అభివృద్ధిపై ఏపీ టూరిజం డెవల్ప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆధ్వర్యంలో దృష్టి సారించింది. విశాఖ పట్నంలో బీచ్లకు సందర్శకులు తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్నామ్నాయంగా మరికొన్ని ప్రాంతాల్లో బీచ్లను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు యారాడ బీచ్ను బ్లూ ఫ్లాగ్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం సంకల్పించింది.
రుషికొండ ‘బ్లూ ఫ్లాగ్’ బీచ్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ బీచ్ల అభివృద్ధికి పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే యారాడ బీచ్ను ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకులు యారాడ వైపు మళ్లేలా "బ్లూ ఫ్లాగ్" ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. సందర్శకులకు అవసరమైన సౌకర్యాల కల్పన, రెస్టారెంట్ నవీకరణ పనులు చేపట్టాలని, అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రయాణం కష్టమే కానీ కళ్లు చెదిరే అందాలు - ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం
యారాడ వద్ద తీరాన్ని ఆనుకొని ఉన్న అగ్రి గోల్డ్ సంస్థ ఖాళీ స్థలాల్లో చిన్నపాటి పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీటీడీసీ ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటక సమాచార కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ కేంద్రం అందుబాటులోకి వస్తే ఏపీటీడీసీ ప్యాకేజీలు, సందర్శనీయ ప్రాంతాల సమాచారం తెలుసుకునే వీలుంటుంది. అదే విధంగా జిల్లాలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పర్యాటక భవన్ను నిర్మించాలనే ప్రతిపాదనపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.