Chiranjeevi Padma Vibhushan Award Ceremony: టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి ఇటీవలె పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ఆయన సతీమణి సురేఖతో పాటు కుమారుడు రామ్చరణ్, కోడలు ఉపాసన కూడా వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వీటితో పాటు ఇప్పుడు ఓ క్యూట్ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో ఉపాసన, చిరుల సంభాషణ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
అవార్డు వేడుకకు ముందు ఓ చిన్నపాటి ఫొటో సెషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ సమయంలో ఉపాసన అక్కడ జరగుతున్నదంతా వీడియో తీస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న చిరును ఉప్సీ ఓ ప్రశ్న అడగ్గా, దానికి ఆయన అమాయకంగా సమాధానం చెప్పారు.
"మామయ్యా నాకు, క్లీంకారాకు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి" అని ఉపాసన అడగ్గా, దానికి చిరంజీవి కాసేపు ఆలోచించి 'ఆమె నీ ప్రతిరూపం' అంటూ సమాధానమిచ్చారు. అయితే దానికి "కాదు, మామయ్యా, అదేంటంటే మా ఇద్దరి తాతయ్యలకు పద్మవిభూషణ్ వచ్చింది" అంటూ ఉపాసన అసలు ఆన్సర్ చెప్పారు. ఇక ఆ మాట విన్న చిరు అవును అది నిజమే కదా అంటూ నవ్వారు. ఆ వీడియలో చెర్రీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.