SJ Suryah Career :ఎస్ జే సూర్య ఇప్పుడీ పేరు కోలీవుడ్లోనే కాదు టాలీవుడ్లోనూ బాగా వినిపిస్తోంది. వాస్తవానికి చాలా మంది సినీ ప్రియులకు ఈయన సుపరిచితమే. ఎందుకంటే ఈయన నటుడు కాకముందు దర్శకుడు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో కలిసి 'ఖుషి' చిత్రాన్ని అప్పట్లోనే తెరకెక్కించి కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తమిళంలో అజిత్తో 'వాలి' చేసి భారీ హిట్ను అందుకున్నారు. అలా తమిళంలో, తెలుగులో దర్శకుడిగా తనదైన మార్క్ వేసుకున్నారు.
హోటల్ సర్వర్గా!
అయితే కెరీర్ తొలినాళ్లలో ఎస్ జే సూర్య ఆకలి తీర్చుకోవడం కోసం హోటల్లో సర్వర్గా పనిచేశారట. రోజుల తరబడి ఆకలితో అలమటించడంతో ఇలా చేరారట. ఇంటి అద్దె చెల్లించడానికి కూడా కష్టపడేవాడేవాడినని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఎస్ జే సూర్య స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి స్టార్ డైరెక్టర్ అయ్యారు ఎస్ జే సూర్య. సౌత్ ఇండియాలో విలన్ పాత్రలకుగానూ కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు. ఈ సౌత్ ఇండియన్ విలన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.8కోట్లు- రూ.10 కోట్లు వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్లో విలన్ పాత్రల్లో నటిస్తున్న సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, బాబీ దేఓల్ కన్నా ఎస్ జే సూర్యనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారట.
సినీ కెరీర్
ఎస్ జే సూర్య 1999లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 'వాలి' మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమిళనాడులోని చాలా థియేటర్లలో ఈ మూవీ 270రోజులు ఆడింది. ఆ తర్వాత దళపతి విజయ్తో 'ఖుషి' తీశారు. ఆ సినిమా కూడా పెద్ద బ్లాక్ బ్లస్టర్ అయ్యింది. ఆ సినిమానే తెలుగులో పవన్ కల్యాణ్తో, హిందీలో ఫర్దీన్ ఖాన్తోనూ రీమేక్ చేశారు.
2005 తర్వాత సూర్య దర్శకత్వ కెరీర్ కాస్త నెమ్మదించింది. ఆశించినమేర విజయాలు దక్కలేదు. అప్పుడే నటుడి అవతారం ఎత్తారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన 'ఇరైవి' సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2017లో మహేశ్ హీరోగా తెరకెక్కిన 'స్పైడర్', దళపతి విజయ్ 'మెర్సల్'లో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాల్లో తనదైన నటనతో విలనిజం పండించడం వల్ల మరిన్ని అవకాశాలు పెరిగాయి.