Education News :పది, ఇంటర్, డిగ్రీ వార్షిక పరీక్షలకు తోడు ప్రవేశ పరీక్షల తేదీలు కూడా వచ్చేశాయ్. దీంతో రానున్నది అంతా విద్యార్థులకు పరీక్షా కాలం. ఈ నేపథ్యంలో కోరుకున్న విద్యాసంస్థలు, కోర్సుల్లో చేరాలనేది ప్రతి విద్యార్థి లక్ష్యం, ఇందుకు సన్నద్ధమవడమే అత్యంత కీలకం. ఇందుకు ఓ వైపు వార్షిక, మరోవైపు ప్రవేశ పరీక్షల్లో రాణించేందుకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు సమాయత్తమవ్వాలి. వీటిలో వార్షిక పరీక్షల పాఠ్యాంశాల కంటే అర్హత పరీక్ష కొంత భిన్నంగా ఉంటుంది. అభిరుచి గల కోర్సు, ఆసక్తిగల కళాశాలలో సీటు దక్కాలంటే ఆ మాత్రం శ్రమించక తప్పదు. అప్పుడే మీరు కలలు కన్న కల సాకారం అవుతుంది. కానీ పోటీ పరీక్షల్లో సరైన సమయంలో సరైన సమాధానం గుర్తించిన వారే విజేతలుగా నిలుస్తారనే విషయం తెలుసుకోవాలి.
ఇలా చేస్తే ప్రయోజనం :
- ముందుగా ప్రతి అంశంపై పట్టు సాధించేలా చదవాలి.
- వాటిలో అర్థం కానివి, పూర్తిగా కఠినమైనవి వదిలి, మిగతా అంశాలను వందశాతం అర్థవంతంగా చదవాలి.
- రోజులు గడుస్తుంటే పరీక్ష సమీపిస్తుందనే భయం ఉంటుంది.
- సిలబస్ ప్రకారం మొత్తం అంశాలపై ఒక అవగాహన వచ్చిన తర్వాత పునఃశ్ఛరణ, పరీక్ష సాధన వంటివి ఒక క్రమపద్ధతిలో అనుసరించాలి.
ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి :
- ఉదయం 5గంటలకు నిద్రలేచి టీ, అల్పాహారం.
- 6 నుంచి 7 గంటల వరకు గతరాత్రి చదివిన అంశాల పునశ్ఛరణ.
- 7 నుంచి 10 వరకు కఠిన అంశాల పఠనం, సాధన.
- 10 నుంచి 12 వరకు బృందచర్చలు.
- 12 నుంచి 1 గంట వరకు భోజన విరామం.
- 1 నుంచి 3 వరకు సందేహాల నివృత్తి, అనుభవజ్ఞుల సలహాలు స్వీకరణ, నిపుణుల శిక్షణ.
- 3 నుంచి 6 దాకా గత పరీక్షల ప్రశ్నపత్రాలు, మాదిరి పరీక్షల సాధన.
- 6నుంచి పది వరకు అప్పటివరకు చదివిన అంశాల మననం.
- 10నుంచి 11గంటల వరకు పఠనం.