Shantanu Naidu Tribute To Ratan Tata : దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మరణం యావత్ భారత దేశాన్ని కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలు, ప్రముఖులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ముఖ్యంగా ఆయన సన్నిహితులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో టాటాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు కూడా ఉన్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా మృతికి నివాళులు అర్పించారు. తామిద్దరు కలిసి దిగిన ఓ పాత ఫొటోను షేర్ చేసి దానికి 'గుడ్బై మై డియర్ లైట్హౌస్' అంటూ ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
"మీ నిష్క్రమణతో మన స్నేహంలో ఓ శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి నేను ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవ్వడం వల్ల కలుగుతోన్న దుఃఖం ఏమాత్రం పూడ్చలేనిది. గుడ్బై మై డియర్ లైట్హౌస్" అని శంతను భావోద్వేగానికి లోనయ్యారు.
ఎవరీ శంతను నాయుడు?
చివరిదశలో రతన్ టాటాతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో శంతను ఒకరు. ఈ యువకుడితో టాటా స్నేహం అందరినీ ఆశ్చర్యపర్చింది. టాటా ట్రస్ట్లో అతి పిన్నవయస్కుడైనా జనరల్ మేనేజర్గానూ, అలాగే టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్గానూ శంతను వ్యవహరించిన తీరు ఎంతో మందిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.